YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీఎంగా అవకాశమివ్వాలని గవర్నర్ కలిసిన కాంగ్రెస్ లేఖ

సీఎంగా అవకాశమివ్వాలని గవర్నర్ కలిసిన కాంగ్రెస్ లేఖ
ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దుచేసి తమకు అవకాశం కల్పించాలని కోరుతూ గోవా గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రభుత్వాన్ని రద్దుచేసి అతిపెద్ద మెజార్టీ పార్టీ అయిన తమనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు బాబూ కవేల్కర్ అందజేశారు. అయితే, శాసనసభను రద్దుచేయడాన్ని తాము అంగీకరించబోమని అందులో స్పష్టం చేశారు. మంగళవారం తమ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని సీఎంగా నియమించలేదని కవేల్కర్ ఆరోపించారు. గత కొంత కాలంగా క్లోమగ్రంధి కేన్సర్‌తో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పారికర్  అమెరికాలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం గోవాకు చేరుకున్న ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా శాసనసభలో కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులున్నారు. అయితే, కేవలం 14 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఎంజీపీ 3, గోవా ఫార్వర్డ్ 3, ఎన్సీపీ 1, ముగ్గురు స్వతంత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనారోగ్యం కారణంగా మనోహర్ పారికర్ విధులకు హాజరుకాకపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సభలో తమదే అతిపెద్ద మెజార్టీ పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు కూడా మాకే ఉందని వాదిస్తోంది. వాస్తవానికి గోవా ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం... ప్రజల తీర్పు మేరకే గవర్నర్ సహాయం కోరుతున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వం పనిచేయడం లేదు.. పాలన కూడా స్తంభించింది.. రాష్ట్రంలో మంత్రులు, గవర్నర్ కూడా లేరు.. మొత్తం శూన్యం ఏర్పడిందని ఆయన అన్నారు. 

Related Posts