- ఏవీ కాలేజీ లో సందేశ్ సభ
- మరోమారు హజారే ఉద్యమం..
ప్రముఖ సామాజిక ఉద్యమకారులు అన్నా హజారే ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. పలు ప్రజాసమస్యలపై పోరాడేందుకు ఢిల్లీలో నిర్వహించనున్న ఆమరణ దీక్షకు హైదరాబాద్లో సన్నాహక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హజారే, ఇందులో భాగంగా హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ వాలంటీర్స్ (ఐఏసీవీ) అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి ఎర్రబెల్లి రజనీకాంత్ ఒక ప్రకటన చేశారు. రైతులను ఆదుకునేందుకు, ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు, అవినీతిని అంతమొందించాలనే డిమాండ్లతో హజారే ఉద్యమం వచ్చే నెల ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మార్చి 23 నుంచి ఢిల్లీలో హజారే అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు.
హజారే దీక్షకు ప్రజలను సన్నద్ధం చేసేందుకు బహిరంగ సభలను పెద్ద ఎత్తున ఐఏసీవీ నిర్వహిస్తోంది. హెదరాబాద్, ఏవీ కాలేజీ లో జరిగే అన్నా హజారే బహిరంగ సభను ‘సందేశ్ సభ’ పేరుతో వ్యవహరిస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో 100 స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటుండగా, 5000 మంది రైతులు, యువతీ యువకులు ఈ సభకు తరలివస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. రైతులకు 50 శాతం మద్దతు ధర, 60 ఏళ్లు నిండిన అన్నదాతలకు ఐదు వేల రూపాయల పెన్షన్, అవినీతి లేని సమాజం కోసం లోక్ పాల్ వంటివి ప్రధాన డిమాండ్లుగా మరోమారు హజారే ఉద్యమం తెరపైకి వచ్చింది.