YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

పెళ్లి తర్వాత వెండితెరపై ‘ఏమాయ చేసావె’ జంట

పెళ్లి తర్వాత  వెండితెరపై  ‘ఏమాయ చేసావె’ జంట

అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వెండితెరపై సందడి చేయబోతున్నారట. ‘ఏమాయ చేసావె’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ సినిమాల్లో జంటగా సందడి చేసిన వీరిద్దరూ మరో కొత్త ప్రాజెక్టులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్‌ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుందట. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. చై-సామ్‌ ఇప్పటికే కథ విన్నారట. ఇద్దరికి నచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాకు సంతకాలు చేయడమే మిగిలి ఉందట.

చై-సామ్ జోడీగా సినిమా రాబోతోందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ ‘2స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌లో వీరిద్దరూ నటించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. ఇప్పుడు ఈ రీమేక్‌లో అడివిశేష్‌ హీరోగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివానీ ఈ చిత్రంతో నటిగా పరిచయం కాబోతున్నారు.

సమంత ఇటీవల ‘రంగస్థలం’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క ఆమె కీలక పాత్రలో ‘మహానటి’ రూపుదిద్దుకుంటోంది. పలు తమిళ చిత్రాల్లోనూ సమంత కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. చైతన్య ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైంది. చైతన్య కథానాయకుడిగా నటించిన ‘సవ్యసాచి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts