YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాఫెల్ పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

రాఫెల్ పై  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించే ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కొనుగోలు ఒప్పందంలోని ధరలు, వ్యూహాత్మక వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పదిరోజుల్లోగా అన్ని వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్ సెట్ భాగస్వాముల వివరాలను కూడా అందించాలని ఆదేశించింది.
రఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ విపక్షాలు మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రఫెల్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను 10రోజుల్లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని న్యాయస్థానం కోరగా, ఎంతో సున్నితమైన ఈ వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విలువ, ధరకు సంబంధించిన వివరాలను 10 రోజుల్లోగా అందజేయాలని, పిటిషనర్లు దీనిపై వారం రోజుల్లో స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అలాగే, కేవలం ధరకు సంబంధించిన వివరాలు మాత్రమే కోరుతున్నామని, సాంకేతిక అంశాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
రఫెల్ ధర చాలా ప్రత్యేకమైందని, దీన్ని న్యాయస్థానంతో పంచుకోలేమని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. అధికారిక గోప్యత చట్టం పరిధిలోకి వచ్చే దీని వివరాలను వెల్లడించలేమని ఆయన తెలియజేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఒకవేళ రఫేల్ విలువను తెలియజేయకపోతే, అలా అని పేర్కొంటూ అఫిడవిట్ను తమకు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. రఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణం దాగిఉందని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడంతో బీజేపీకి కొంత ఇబ్బందిగా పరిణమించింది. రఫెల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరతీశాయి. రఫెల్ ఒప్పందం వివాదం తీవ్రం కావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, పైవిధంగా స్పందించింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరగా, వేచిచూడాలని, ప్రస్తుతం సీబీఐ ఇంటిపోరు చక్కబడాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ వ్యాఖ్యానించారు

Related Posts