- శంషాబాద్ ఎయిర్పోర్టుకు పరుగులు పెడుతున్న ఏసీ బస్సులు
- ఈ మార్గంలో 35 మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు
- త్వరలో 40 బ్యాటరీ బస్సులు
విమాన ప్రయాణం..అదో అద్భుత అనుభూతి..ఆకాశ మార్గంలో అతివేగంగా హాయిగా గమ్యం చేరుకోవచ్చు. అదీ ఎయిర్బస్ గొప్పతనం.. మరి అలాంటి వారు రోడ్డు మార్గంలో ప్రయాణించేటపుడు ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటారు.. దాదాపు ఏరోప్లేన్లో వెళ్లేటపుడు ఉన్న సౌకర్యాలే ఉండాలనుకుంటారు.. అందుకు టీఎస్ ఆర్టీసీ అటువంటి వారి కోసం గాల్లో తేలిపోయే ప్రయాణ అనుభూతిని కల్పిస్తోంది. మెట్రో లగ్జరీ ఏసీ ఓల్వో బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి నగరం నుంచి ప్రయాణికులను చేరవేస్తూ మనసు చూరగొంటూంది.
పెరిగిన ప్రయాణికులు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగింది. ప్రతి రోజూ సుమారు 404 ఫ్లైట్ సర్వీసులు నడుస్తున్నాయి. సుమారు 40 వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. విమానసర్వీసుల సంఖ్య, ప్రయాణికుల రద్దీ పెరడంతో ఆర్టీసీ మెట్రో బస్సులకు సైతం ఆదరణ లభిస్తోంది. మరోవైపు గత సంవత్సరం వరకు ఎయిర్పోర్టు మార్గంలో నడిచిన పుష్పక్ బస్సుల స్థానంలో మొదట 29 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్యను తాజాగా 29 నుంచి 35 కు పెంచారు.. ఒకప్పుడు 35 నుంచి 40 శాతం వరకే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో సైతం ప్రస్తుతం సుమారు 65 శాతానికి చేరింది. దీంతో ఎయిర్పోర్టు మార్గంలో మరిన్ని అధునాతన బస్సులను ప్రవేశపెట్టేందుకు గ్రేటర్ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది.
పెరిగిన ఆదాయం....
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ బస్సులు గతంలో తీవ్రమైన నష్టాలతో నడిచాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ మార్గంలో బస్సులు తిప్పాలంటే ఒక కిలోమీటర్పైన కనీసం రూ.45 లు లభించాలి. కానీ పుష్పక్ బస్సులపైన రూ.33 నుంచి రూ.35 లు మాత్రమే లభించేవి. దీంతో ఒక కిలోమీటర్పైన సగటున రూ.10 ఆర్ధిక నష్టంతో, ప్రతి రోజు ఒక బస్సుపైన రూ.5000 నష్టాలతో పుష్పక్ బస్సులు నడిచాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ ఏటా కోట్లాది రూపాయల నష్టాలను చవిచూసింది. మెట్రోలగ్జరీ బస్సులను ప్రవేశపెట్టిన తరువాత ఈ నష్టాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.‘ ఇంకా లాభాల బాటలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ నష్టాలు మాత్రం తగ్గాయి.
త్వరలో 40 బ్యాటరీ బస్సులు....
ఎయిర్పోర్టు మార్గంలో మెట్రో లగ్జరీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ పెరగడంతో త్వరలో విద్యుత్తో నడిచే 40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పూర్తిగా పర్యావరణహితంగా, ఏసీ సదుపాయంతో నడిచే ఈ అత్యాధునిక బస్సులను గతంలో ప్రయోగాత్మకంగా నడిపారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. దీంతో మరిన్ని బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపేందుకు ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది.