YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                     బాల కాండ చివరి పద్యాలు-గద్యం

 

    కం:    ఓంకారాత్మక రామా ! శంకరగిరిజావిరించి జపితసునామా !
        సంకటనిచయవిరామా ! పంకజమిత్రాన్వయ  వారిధిసోమా !

    కం;    సర్వాధిక  సర్వాత్మక ! సర్వ జగత్కారణా ప్రశస్తగుణాఢ్యా !
        సర్వాదిమకారణ హరి ! సర్వ శరణ్యా మాహత్మ సర్వస్తుత్యా !

    తరలం:    జలజవైరిమహీధరాగ్ని  శశాంకపద్యనిరూపితా
        తులితబాల్యవినోదఖేలన  తోయజాక్ష ! రమాధవా !
        కలశవారిధితుల్యసజ్జన  కాండ  చిత్తనివాసకా !
        కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా !

    జలజవైరి అంటే చంద్రుడు = 1 , మహీధరఅంటే పర్వతాలు= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసుదాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.
    ఇది శ్రీమద్రామచంద్ర చరణారవిందమిళిందాయమాన మానసత్వ మహావైభవ
        వావిలికొలను రామచంద్ర రాయతనూభవ సుజనవిధేయ
            సుబ్బరాయ నామధేయ ప్రణీతం బైన
            శ్రీ మదాంధ్ర వాల్మీకిరామాయణ మను
            మహాకావ్యంలో బాలకాండ మందరం
                                    అనువక్త-వాచవి
    వనం జ్వాలా నరసింహారావు

        నమోస్తు  రామాయ  సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై
    నమోస్తు  వాతాత్మభువే  వరాయ, నమోస్తు  వల్మీక భవాయ తస్మై.
 
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగుచెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో-ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.
    ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము" , "పంచ చామరం" , "కవిరాజ విరాజితము" , "తరలము" , "ప్రహరణకలిత" , "సుగంధి" , "ఉత్సాహం" , "మనోహరిణి" , "వనమయూరము" , "తోటకము" , "మానిని" , "ఇంద్రవంశము" , "లయగ్రాహి" , "తోదకము" , "మాలిని", "కలితాంతము" , "మధురగతిరగడ" , "వనమంజరి" , "కమల విలసితము" , "వసంతమంజరి" , "మంజుభాషిణి" , "స్రగ్ధర" , "వసంతతిలక" , "మాలి" , "కరిబృంహితము" , “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత"లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.
    వేదాంగాల్లో పద్య లక్షణాలను తెలియచేసే ఛందస్సు ఒక భాగం. పద్యం ఎలా రాయాలి, ఏ ఏ లక్షణాలతో ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. ఛందస్సు పరమేశ్వరుడి నుండి పరంపరంగా భూలోకానికి వచ్చిందంటారు. పద్యాలతో కవిత్వం చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అనవచ్చు. పద్యం ఒక నియమానుసారం "పాదాలు" గా విభజించబడతాయి. ఆ పాదాలు "గణాల" మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని బట్టి-స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించబడ్డాయి. గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. భాషలో వున్న అక్షరాల స్వరూప-స్వభావాలను బట్టి ఛందశ్సాస్త్రంలో "గురువు"-"లఘువు" లని వ్యవహరించబడతాయి. గురు-లఘువుల కూడికే గణాలు అంటారు. గురువు-లఘువు ఎలా ఏర్పడతాయో, ఏ ఏ అక్షరాలు గురువు-లఘువులుగా గుర్తించవచ్చో ఛందస్సుతో కవిత్వం రాసే వారందరికీ తెలుసు. అలానే సూర్యగణాలనీ, ఇంద్రగణాలనీ, చంద్రగణాలనీ కూడా వుంటాయి.
    పద్య లక్షణాలలో ముఖ్యమయినవి "యతి-ప్రాస” లు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. దీన్ని ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి, ప్రతిపాదానికి ఏర్పాటుచేయడం జరుగుతుంది. ప్రతిపాదానికి మొదటి అక్షరమైన యతి, తిరిగి ఆయా పద్యాల్లో పేర్కొన్న స్థలాల్లో చెప్పాలని ఛందస్సు శాస్త్రం చెప్తుంది. యతికి పర్యాయ పదాలు కూడా వున్నాయి. పద్యపాదంలో మొదటి అక్షరం యతి అవుతే, రెండవ అక్షరం ప్రాస అవుతుంది. యతి-ప్రాసలకు వున్న నియమాలన్నీ పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించితీరాల్సిందే. పద్యంలో వున్న మొదటి అక్షరంతో (యతి) సమానమైన అక్షరాన్ని నియమించిన స్థానంలో నిలపడం కుదరనప్పుడు, ప్రాసగా వున్న రెండవ అక్షరాన్ని యతి స్థానం పక్కన వచ్చే విధంగా చేస్తే దాన్ని "ప్రాస యతి" అంటారు. ప్రాస యతిని వాడేటప్పుడు కూడా నియమ-నిబంధనలుంటాయి.
    ఇలా గణాలను, యతి-ప్రాసలను, ప్రాస యతులను నియమబద్ధంగా వాడుతూ పద్యకవిత్వం చెపుతారు కవులు. పద్యాల్లో వృత్తాలని, జాతులని, ఉప జాతులని వుంటాయి. ఛందోబధ్దమై, యతి ప్రాసలు కలిగివుండి, సాధారణంగా నాలుగు పాదాలుంటే పద్యమంటారు. అక్షర గణాలతో ఏర్పడేవి వృత్తాలు. మనందరికీ బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వృత్తాలు. తెలియనివీ, విననివీ ఎన్నో వున్నాయి. వృత్తాల్లో కూడా భేదాలున్నాయి. జాతులంటే కందం, ద్విపద, మంజరీ ద్విపద, తరువోజ, ఉత్సాహం, అక్కరలు, రగడలు లాంటివి. ఇందులో అందరికి తెలిసింది కందం. ఉప జాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం లాంటి పద్యాలున్నాయి.
తెలుగు సాహిత్యంలో పద్య ప్రసూనాలమీద పరిశోధించి, వెయ్యేళ్ల పద్యం పొదుపుకున్న సాహిత్య ప్రక్రియలో భాగంగా, గతశతాబ్ది కాలంలో పద్యకవితలోని వస్తువైవిధ్యాన్ని ఆవిష్కరించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు చెందిన, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానంకార్య నిర్వాహక అధికారి శ్రీ. కె.వి.రమణాచారి. ఆయన పరిశోధనలో ఛందో ప్రయోగాల మీద ప్రయోగవైవిధ్యం గురించికూడా పేర్కొన్నారు. కొందరు కవుల రచనల్లోని పద్యాలు, అందరూ రాసే వృత్తాల్లో కాకుండా విభిన్నరీతిలో వుండే విషయాన్ని ప్రస్తావించారు. బూర్గుల రంగనాథరావు గారు వాడిన మత్తకోకిలము గురించి, తిరుమల కృష్ణదేశికాచార్యులు గారి వసంతకోకిల-పరభృతము-నయాగరా-మనోరమా-ప్రభావతి వృత్తాల గురించి వివరించారు రమణగారు. కందతుల్య, సీసతుల్య, భాస్కరవిలసితం, సర్వలఘుసీసం లాంటి వృత్తాలను ఉటంకిస్తూ తాటిమాను నారాయణరెడ్డి శేషప్రభ కావ్యం గురించి ప్రస్తావించారు. వీ.ఎల్.ఎస్ భీమశంకరం గారు తన ప్రభందంలో సాక్షాత్కరించిన ఛందో విశ్వరూప ప్రదర్శనం మరి ఏ సమకాలిక తెలుగు కావ్యంలో కనిపించలేదని కూడా రమణ గారు రాసారు తన పరిశోధనలో. ఉదాహరణలుగా విలాసిని, కైవల్యం, సుగతి, విభావరి, ద్విపదతుల్య లను పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన రసస్రువు కావ్యంలోని అరుదైన ఛందస్సులైన వంశస్థ వృత్తం, అశ్వగతి, మేధిని, విజయమంగళ, భ్రమర లను కూడా రమణగారు ఉదహరించారు. రాళ్లబండి కవితా ప్రసాద్ రచనల్లోని విశ్వనాథ వృత్తం, భ్రమరకూజితం గురించిన ప్రస్తావన కూడా వుంది.
"శ్రీమద్రామాయణ కల్పవృక్షము"లో విశ్వనాధ సత్యనారాయణగారు ఉపయోగించిన వృత్తాల్లో అరుదుగా వాడే ఛందో ప్రక్రియలు ధారాళంగా వాడారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే: అంతరాక్కఱ, అజిత ప్రతాపము, అపరాజితము, అల్పాక్కఱ, అశ్వలలితము, అశ్వవిలసితము, కవిరాజ విరాజితము, ఉత్సాహము, ఇంద్రవంశము, ఇంద్రవజ్రము, అసంబాధ, అష్టమూర్తి, సుగంధి, వసంత తిలకము, లయగ్రాహి, మాలిని, మానిని, మత్తకోకిల, మంజుభాషిణి, మంగళమహాశ్రీ, భుజంగప్రయాతము, భాస్కరవిలసితము, ప్రహరణకలిత, పద్మనాభము, పంచచామరము, ద్విపద, దృతవిలంబితము, తోదకము, తోటకము, తరలము, చిత్రపదము లాంటివెన్నో వున్నాయి.
ఈ దశాబ్దంలో-ఆ మాటకొస్తే ఏ దశాబ్దంలోనైనా, ఉత్పలమాల, చంపకమాల, శార్థూలం, మత్తేభం, కంద, తేటగీతి, ఆటవెలది, సీస పద్యాలు అందరూ రాస్తూనే వున్నారు. విభిన్నమైన వృత్తాలను ఉపయోగించి ప్రప్రధమంగావాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథా వాల్మీకంగా తెనిగించిన వాసు దాసుగారు చేసిన ఛందో ప్రయోగాలు బహుశా తెలుగు పద్య కవిత్వంలో అరుదైన విషయమేమో. విమర్శకులకే వదిలేద్దాం ఆ విషయాన్ని.
    అందరు కవులు తమరచనల్లో ఉపయోగించినా-ఉపయోగించకున్నా, చాలామంది కవులకు పరిచయమున్న వృత్తాలలో:ఉత్పలమాల, చంపకమాల, మత్తేభ విక్రీడితము, శార్దూల విక్రీడితము, ఇంద్ర వజ్రము, ఉపేంద్ర వజ్ర, భుజంగ ప్రయాతము, తోటకం, మాలినీ, పంచ చామరం, మత్తకోకిల, తరళము, మేఘవిస్ఫూర్జితం, భూతిలకం, స్రగ్ధరా వృత్తం, మానినీ, మహా స్రగ్ధర, కవిరాజ విరాజితం, క్రౌంచ పదం, మంగళ మహాశ్రీ, లయగ్రాహి, దండకం లాంటివెన్నో వున్నాయి. ఇవికాక ఇంకెన్నో వున్నాయి. అందరు కవులకూ అన్ని వృత్తాలలో పద్యాలు రాసే సామర్థ్యం వుండకపోవచ్చు. అలాగే జాతుల్లోనూ, ఉప జాతుల్లోనూ పేర్కొనబడిన వాటన్నిటినీ కవులందరూ వాడాలని లేదు. అవసరం, సామర్థ్యం, సందర్భం వుండాలి.

                                                                     రేపు తరువాయి భాగం.. 

Related Posts