YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని పదవిపై దేవగౌడ కన్ను

 ప్రధాని పదవిపై దేవగౌడ కన్ను
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు తన రాజకీయ లక్ష్యాల గురించి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టమైన సంకేతాలు పంపారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రోడ్డులో పునఃనిర్మించిన భవనంలోకి శుక్రవారం మళ్లీ గృహప్రవేశం చేసి జాతీయ రాజకీయాల్లో తాను మరోసారి కీలకం కాబోతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు, ఆయనతో భేటీ అయిన మర్నాడే తనకు అన్ని విధాల కలిసొచ్చిన ఇంటిలోకి దేవెగౌడ మరోసారి గృహప్రవేశం చేయడం విశేషం. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత వివిధ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడగా, దీనికి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు తెలిపింది. దీంతో దేవేగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ప్రస్తుతం గృహప్రవేశం జరిగిన ఇంట్లోకి వెళ్లిన తర్వాతే ప్రధాని పదవి వరించడంతో తన కుటుంబానికి అదృష్టం కలిసొచ్చిందని ఆయన బలంగా నమ్ముతారు. ఓ జ్యోతిషుడు సలహాతో ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయించి, వాస్తు దోషాన్ని సవరించారు. అనంతరం మరోసారి ఇందులోకి శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. చంద్రబాబుతో గురువారం సమావేశం అనంతరం కర్ణాటక సీఎం, దేవెగౌడ తనయుడు కుమారస్వామి మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో 1996 నాటి ఫలితాలే పునరావృతమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటుచేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన దేవేగౌడ.. భగవంతుని దయవల్ల తన శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో సమర్ధవంతంగా ఉందని, అయినంత మాత్రాన ప్రధాని పదవిని చేపట్టడానికి ఇవే అర్హతలు కావని వ్యాఖ్యానించారు. దీంతో తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని దేవెగౌడ సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేసి తన కుమారుడికి ప్రధాని నరేంద్ర మోదీ విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్కు ఆయన ధీటుగా బదులిచ్చారు. దేవెగౌడ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని, శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉన్నానని చెప్పడానికి ఇదే సంకేతమని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇటీవల కర్ణాటకలో జరిగిన ఉప-ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో మరోసారి కీలక పాత్ర పోషిస్తామని జేడీఎస్ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తోందని, కూటమి నడపడంలో అనుభం ఉన్న దేవెగౌడ ప్రధాని పదవిని చేపట్టడానికి అన్ని విధాలుగా అర్హుడని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో కేవలం 11 నెలలు మాత్రమే ప్రధానిగా పనిచేసినా పాలనలో తనదైన ముద్రవేసి ప్రజల మన్ననలు అందుకున్నారని జేడీఎస్ నేత హెచ్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించిన తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ప్రకటించింది. దీంతో ప్రధాని పదవిపై జేడీఎస్ మరింత ఆశలు పెంచుకుంది. చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఆయనకు మద్దతు తెలిపింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పీఠం కూడా ఇలాగే తమకు దక్కుతోందని ఆ పార్టీ భావిస్తోంది.

Related Posts