YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

ఇక అలంకారాల విషయానికొస్తే, శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని రెండు రకాలున్నాయి. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. స్వభావోక్తులు దేశకాలవక్తృ స్వభావాలను అనుసరించి చెప్పబడ్డాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. ఆయన ఏ విషయాన్ని వర్ణించినా అది మన కళ్ల ఎదుట జరిగిన భావం కలుగుతుంది. ఇక ఉపమాన అలంకారాల విషయానికొస్తే, వాల్మీకి కాళిదాసుకే గురువనిపిస్తాడు. రావణ వధానంతరం రాముడు సీతతో అన్న మాటలకు అర్థం వెతుకుతే, ఆ ఉపమానంలో, సీత నిర్దోషురాలనీ-శంక అనే దోషంతో బాధ పడినవాడు రాముడనీ స్పష్టంగా తెలుస్తుంది. అలానే, రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు రాసిన శ్లోకం కూడా. దానర్థం: సీత లోకమాత అయినందున ఆమెను రావణుడు పట్టుకోవడం తల్లిని పట్టుకోవడమంత మహా ఘోరమైన కార్యమని. ఇంద్రజిత్తు మరణం తర్వాత వాడి సేనలకు పట్టిన గతిని వర్ణిస్తూ రాసిన శ్లోకం మరో చక్కటి ఉదాహరణ.
వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". లంకలో- అశోక వనంలో ఒక "వంక" పారుతుంటుంది. దాని తీరంలో వున్న చెట్ల కొమ్మలు నీళ్లలో వేలాడుతుండడం వల్ల, నీరు వెనక్కు పోతుంటుంది. ఈ సామాన్య విషయాన్ని వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) ఎలా ఉత్ప్రేక్షించినాడో చదివి తీరాల్సిందే. "ఆ పర్వతం పైనుండి కిందకు పారుతున్న సెలయేరు, చూడడానికి, మగడి తొడపై నుండి కోపంతో దిగిపోతున్న స్త్రీలా వుంది. వేలాడుతున్న కొమ్మలు ప్రవాహాన్ని అడ్డగించడంతో, వెనుదిరుగుతున్న నీటి కదలిక సన్నివేశం, బంధువుల బుజ్జగింపులకు సమాధానపడి-శాంతించి, మగడి వద్దకు మరలిపోతున్న ఆడదానిలా వుంది" అన్న అర్థం వస్తుంది ఆ శ్లోకానికి-పద్యానికి. అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు.
శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం.
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"
వేదాన్య విషయంలో కలిగిన ఈ ఆదిమ శ్లోకానికే నిషాద పరంగా ఒక అర్థం, భగవత్ పరంగా రెండో అర్థం వున్నాయి.ఆంధ్ర వాల్మీకంలో దీన్ని ఇలా పద్యంగా మలిచారు కవి.
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
"ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడం, ఆడ పక్షి అది చూసి దుఃఖించడం, పరమ దయామయుడైన వాల్మీకి అది చూసి, బోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని ఈ శ్లోకంలో శపించడంజరిగింది. ఇదే రామాయణ ఉత్పత్తికి కారణమైన శ్లోకం కావడంతో నాంది శ్లోకం అయింది. కాబట్టి దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది.
లక్ష్మణుడు రాముడితో అరణ్యాలకు వెళ్లే ముందర తల్లికి నమస్కారం చేసినప్పుడు, సుమిత్రా దేవి కుమారుడికి చేసిన బోధనను తెలియచేసే శ్లోకానికి పండితులు అనేక అర్థాలను చెప్పారు. అందులో సార్వజనీన సమ్మతమైనవి-ప్రధానమైనవి మూడర్థాలు. సంగ్రహంగా అవి:
మొదటిది: "ఇదివరకు నీవు రాముడికి కుడిచేతిలా, వెలుపల ప్రాణంలా వుండేవాడివి. ఆ భక్తితోనే ఇప్పుడు ఆయన వెంట అడవులకు పోతున్నావు. ఇదివరకు రాముడు మహారాజ కుమారుడు. పట్టణంలో అనేక భోగాలను అనుభవిస్తుండే వాడు. నువ్వూ అలానే సుఖానికి హాని లేకుండా అన్నను కొలుస్తుండే వాడివి. ఇక మీద అలా కాదు. చేయబోయేది సకల దుఃఖ నిలయ కాననవాసం. అదికూడా ఒక రోజు కాదు. 14సంవత్సరాలు. పరివారంతో కాదు-ఒంటరిగా. నువ్వే పరిచారకుడవు. అలాంటి కష్ట కాలంలో నీకు విసుగు కలగవచ్చు. జ్ఞాత వెంట నేనెందుకు కష్టాల పాలు కావాలని అనుకుంటావేమో. అలా భావించ వద్దు. అడవిలో వున్నా, పట్టణంలో వున్నా, ధనికుడైనా, దరిద్రుడైనా తండ్రి ఎలా పూజనీయుడో, పితృసమానుడైన రాముడలానే. తండ్రిమీద ఎలాంటి గౌరవం వుంచాలో అలాంటిదే శ్రీరాముడి మీదుంచు. అలానే, నామీద నీకెలాంటి గౌరవం వుందో అలాంటిదే సీత మీదుంచు. అడవిని దుఃఖాలయంగా భావించ వద్దు. సుఖమైన అయోధ్యగా భావించు. సుఖ దుఃఖాలు మనఃకల్పితాలు. నీ మనస్సు నీ వశంలో వుంటే ఎక్కడున్నా నీకు సుఖ దుఃఖాలు సమానమే".
రెండోది: అదే "రాముడ యెరుంగుమీ దశరథుడు నిజము" అన్న సుమిత్ర మాటలకు మరో అర్థం రాముడు అడవులకు పోయిన తర్వాత ఆయన తండ్రి జీవించడని-అది నిజమని. "నీ తండ్రి ఎప్పుడు మరణించునో అప్పుడు నా గతేంటి? ఇక్కడే మో కైక ప్రభుత్వం. ఆమెకు నా మీద ద్వేషమన్న సంగతి నీకు తెలిసిందే. నీ తండ్రి లేకుండా, రాముడు లేకుండా, నువ్వూ లేకుండా నన్ను కైక ఇక్కడ వుండనిస్తుందా? కాబట్టి నేను పుట్టిల్లు చేరాల్సినదాన్నే. అక్కడ నాకు ప్రతిష్టేముంటుంది? దశరథుడి భార్య అన్న గౌరవం నశించింది. అక్కడివారు మన రాజు కూతురు పుట్టింటికి వచ్చిందని నన్ను-నా తండ్రిని చులకనగా అంటారు. అలాంటప్పుడు అయోధ్య గతి ఏమందువా? అయోధ్యే అడవి కాగలదు"
మూడోది: "కుమారా-నేనెందుకు జ్ఞాతైన రాముడి వెంట అడవికి పోయి ప్రాణాపాయానికి లోనుకావాలనీ, నన్నెవ్వరు పొమ్మన్నారనీ, నాకై నేను చెట్టు కొట్టి మీద వేసుకొనడమెందుకనీ, నేను పోతే కలిగే లాభమేమిటనీ, పోకపోతే నష్టమేంటనీ సందేహిస్తున్నావేమో ! అలాంటి ఆలోచనలు చేయవద్దు. లక్ష్మీనారాయణులుండే స్థలమే వైకుంఠం. అడవియే వైకుంఠం. అలాంటి ఏకాంత సేవ దొరకడం దుర్లభం. కాబట్టి-నాయనా, తదేక ధ్యానంతో భగవత్ సేవను అరణ్యంలో చేసుకో" అని బోధించెను.
ఇలా నానార్థాల పద్యాలను అన్వయించేందుకు ఆంధ్ర వ్యాకరణ సూత్రాలను సమయోచితంగా అనుసంధానం చేసుకోవాలి.
అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి)రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత, శ్రీరాముడు ప్రియా వియోగానికి దుఃఖిస్తూ, అడవిలో జనులెవ్వరూ వుండకపోవడంతో, కళ్లకు కనిపించే పక్షి-వృక్ష-మృగాలను సంబోధించుకుంటూ పోతూ-పోతూ, రావణుడు జటాయువుతో యుద్ధం చేసిన స్థలానికి సమీపంలో వున్న ప్రస్రవణగిరిని చూస్తాడు. చూసి " ఓ పర్వత రాజా ! నా వల్ల ఒంటరిగా, రమ్యమైన ప్రదేశంలో విడువబడిన సర్వాంగ సుందరైన సీత నీ చేత చూడబడెనా" అన్న ప్రశ్న వేసిన శ్లోకం (పద్యం) చక్కటి చిత్రాలంకారం. వృక్షాలకు-నదులకు వలె కాకుండా, కొండలకు ప్రతిధ్వని ఇచ్చే గుణం వుంది. దీన్ని మనస్సులో పెట్టుకున్న కవి ఈ శ్లోకాన్ని (పద్యాన్ని) రచించారు. ప్రతిధ్వనిలో మనం అన్న మాటలే మనకు తిరిగి వినపడ్తాయి. "నీవు చూశావా?" అంటే "నీవు చూశావా?" అని ప్రతిధ్వని వస్తుంది. అలా వినబడిందని రాస్తే సారస్యం లేదనుకున్న వాల్మీకి ప్రతిధ్వనిగా వినపడిన శ్లోకాన్ని " ఓ రాజ శ్రేష్టుడా ! రమ్యవనదేశమందు నీ చేత ఒంటరిగా విడువబడిన సర్వాంగ సుందరి నా చేత చూడబడె" అనిఅర్థం వచ్చే ట్లు రాశారు. ఇలా ప్రశ్న-జవాబు ఒక్క వాక్యంగానే వుంటే చిత్రాలంకారం అవుతుంది. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు.
వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. దశరథుడి మృతి గురించి కైక భరతుడికి చెప్తూ, "ఎల్ల భూతములకు నెయ్యదిగతి నీదు తండ్రి యట్టిగతికి దనయ యరిగె" అని అంటుంది. తానేదో ఘనకార్యం సాధించినట్లు కైక చెప్పిన పద్ధతిలో, తన భర్త చావు గురించి, తన కుమారుడితో ఏ తల్లైనా చెప్తుందా? ఇదే వాల్మీకిలోని ప్రత్యేకత. ఇదే వార్తను భరతుడు శ్రీరాముడితో మరోలా చెప్తాడు. "నిను దలంచియ యేడ్చుచున్.... ..... నీదు దర్శన కాంక్షియై..... ..... జనకు డక్కట యస్తమించెను జాల నిన్నె స్మరించుచున్" అని దీనోక్తిగా అంటాడు. వినాశ కాలానికి నోటినుంచి విపరీత వాక్యాలే వస్తాయి. శుభ వాక్యాలు, అశుభ వాక్యాలుగా అవుతాయి.
మరో సందర్భంలో, మొట్టమొదట వానరుల మీదకు యుద్ధానికి పొమ్మని ధూమ్రాక్షుడుని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఆజ్ఞాపిస్తూ, "నీవు వధార్థమై మదవ నేచరయుక్తుడు రాముమీదికిన్"  అంటాడు. రావణుడి కోరిక రామాదులను చంపటానికే అయినా, "నువ్వు చావడానికి" అన్న విపరీతార్థం వచ్చింది ఆయన మాటల్లో. శ్రీరామచంద్రుడు ఎలా "ఆత్మవంతుడో" అలానే కుంభకర్ణుడు "వపుష్మంతుడు". అతడిది సహజ శక్తి. వరబలం కాదు. కేవలం దేహం మీదే దృష్టి నిలిపేవాడి కుండే పెద్దదేహముందతడికి. బలం, తాగుబోతు దనం, నిద్దురబోతుదనం, తిండిబోతుదనం లాంటి గుణాలన్నీ పరిపక్వదశకొచ్చి వాడిలో నిలిచాయి. ఇలాంటి వాడు, తను రాముడి మీదకు యుద్ధానికి పోతానని రావణుడితో అంటాడు. ఆయన చెప్పిన మాటల్లోనూ విపరీతార్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. ".... బోదు హతుడుగాగ, రామవిభు డక్షయంబుగ రమణి సీత బొంద గలుగును..." అని  కుంభకర్ణుడుతో అనిపించాడు వాల్మీకి.

                                                                     రేపు తరువాయి భాగం.. 

Related Posts