YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్ కు అమెరికా మరో షాక్

పాకిస్తాన్ కు అమెరికా మరో షాక్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం వరుసగా షాక్‌లు మీద షాక్‌లు ఇస్తోంది. ఉగ్రవాదుల స్వర్గంగా మారిన పాక్, వారిని ప్రోత్సహిస్తోందంటూ అమెరికా గత కొద్ది కాలంగా మండిపడుతోంది. తాజాగా, ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్థాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ రూ.9,260 కోట్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాదుల నిర్మూలనలో పాక్ వైఖరి మారనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు అబోటాబాద్‌లోని తమ భూభాగంలోనే రహస్యంగా ఆశ్రయం కల్పించిందని అమెరికా దుయ్యబట్టింది. దీనిపై గతంలో ఒబామా ప్రభుత్వం హాయంలో అఫ్గనిస్థాన్, పాక్‌తోపాటు మధ్య ఆసియాల్లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన డేవిడ్ సిడ్నీ పాక్‌పై మండిపడ్డారు. ‘ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్‌ నేతలు తమకు హమీ ఇచ్చారని, అయితే అవి కేవలం మాటలకు పరిమితం అయ్యాయి కానీ ఆ దిశగా పాకిస్థాన్‌ కఠినమైన చర్యలు తీసుకోలేదు. దీనివల్ల పొరుగు దేశాలు నష్టపోతున్నాయి. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా సహకారాన్ని నిలిపివేయడం పాక్‌కు గట్టి హెచ్చరిక లాంటిది. తాలిబన్‌, లష్కర్‌ ఏ తొయిబా లాంటి ఉగ్ర సంస్థలపై ఒకవేళ పాక్‌ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్గన్‌లో శాంతియుత వాతావరణం నెలకుంటుందని, దీనివల్ల భారత్‌తో సత్సంబంధాలు ఏర్పడతాయి’ అని డేవిడ్ సిడ్నీ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వ చర్యలు ఆ దేశంలో ప్రజలతోపాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పాక్-అఫ్గన్ సరిహద్దులో రెచ్చిపోతున్న హక్కానీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోనందుకు పాకిస్థాన్‌కు రూ.2,136 కోట్ల సాయాన్ని ఇప్పటికే నిలిపివేయగా, ఉగ్రవాద నిర్మూలనలో పాక్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన మర్నాడే అమెరికా రక్షణశాఖ కొరడా ఝులిపించడం గమనార్హం. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తన పొరుగు దేశాలపై పాకిస్థాన్ వారిని దాడులకు ప్రేరేపిస్తోందని సిడ్నీ ధ్వజమెత్తారు. అలాగే తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తే ప్రభుత్వంపై కూడా పాక్ భద్రతా దళాలు ఇటీవల కాలంలో బెదరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఒకవేళ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటే, దీని వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడతాయనే ఆశాభావం డేవిడ్ వ్యక్తం చేశారు. 

Related Posts