ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం ఈ కేసును విచారణ జరిపిన కోర్టు.. మత్తయ్య వాదనలు వినింది. తనకు ప్రాణ హాని ఉందని.. తెలంగాణ డీజీపీ మాత్రం అలాంటిది ఏమీ లేదని నివేదిక ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భద్రత కోసం డీజీపీని కలిసి విన్నవిద్దామనుకున్నా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. దీనిపై స్పందించిన కోర్టు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో వాదనలు వినిపిపించేందుకు లాయర్ను నియమించుకోవాలని మత్తయ్యను సుప్రీం గతంలోనే చెప్పింది. దీనిపైనా విచారణ జరపగా.. కోర్టే తనకు న్యాయవాదిని నియమించాలని మత్తయ్య కోరారు. దీంతో మత్తయ్యకు అమికస్ క్యూరీగా సిద్ధార్థ్ ధవేను నియమించింది. కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. మరోవైపు ఉదయ్సింహా ఇంప్లీడ్ పిటిషన్పై కూడా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సింహా తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపించారు. ఉదయ్ సింహా వేసిన పిటిషన్తో కేసు ఆలస్యం అవుతుందని తెలంగాణ ఏసీబీ తరపు లాయర్ వాదించగా.. ఈ కేసులో కీలకమైన వ్యక్తిని ఇంప్లీడ్ చేయాలని లుత్రా అన్నారు. వీరిద్దరి మధ్య వాదనలు జరగ్గా.. సమయమనం పాటించాలని జడ్జిలు సూచించారు. కాని ఈ ఇంప్లీడ్ పిటిషన్పై మాత్రం ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు