దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.
విష్ణు, బ్రహ్మల మధ్య తలెత్తిన ఆధిపత్య తగవును పరిష్కరించే క్రమంలో.. శివుడు లింగరూపంలో అవతరించాడన్నది భక్తుల విశ్వాసం. లింగోద్భవం జరిగిన మాఘ బహుళ చతుర్దశి రోజున.. మహాశివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. భక్తులు, పగలంతా ఉపవసించి, రాత్రంతా జాగరణ చేసి.. శివధ్యానంలో మునిగితేలుతుంటారు.
శివుడి సన్నిధిలో జాగరణ చేయాలని ఎక్కువమంది భక్తులు భావిస్తారు. అందుకే.. ముఖ్యమైన శైవక్షేత్రాలకు తరలివెళుతుంటారు. ఈ నేపథ్యంలో చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ఆలయాలన్నీ శివభక్తుల కోసం సన్నద్ధమయ్యాయి. ఆలయాల నిర్వాహకులు కూడా భక్తులకు ఎలాంటి ఇక్కట్లూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు.