- అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు రికార్డ్
- నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్
- పేద సీఎంగా మాణిక్ సర్కార్
- .అయన ఆస్తి కేవలం 26 లక్షల రూపాయలే
- ప్రభుత్వేతర సంస్థ వెల్లడి
దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. 178 కోట్ల రూపాయలతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా రికార్డ్ సృష్టించగా.. కేవలం 26 లక్షల రూపాయలతో పేద సీఎంగా మాణిక్ సర్కార్ నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 15 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.
దేశంలోని ముఖ్యమంత్రులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడని ప్రభుత్వేతర సంస్థ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్-ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ప్రకటించింది. రాజకీయ నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక సిద్దం చేశారు.
దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని సీఎంల వివరాలపై ఈ సంస్థలు నివేదికలు రూపొందించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులను ఈ సందర్బంగా పరిశీలించారు. 100 కోట్లకు పైగా ఆస్తులున్నవారిలో ఇద్దరు,.. 10 నుంచి 50 కోట్ల మధ్య ఆరుగురు,.. 10 కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన సీఎంలు 17 మంది ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తులున్న సీఎంలుగా ఆరుగురు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.
అత్యంత ధనికుడైన సీఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 177 కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమాఖండూ 129 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ 48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 15 కోట్ల 15 లక్షల 82 వేల ఆస్తులు తన పేరున ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక అతి తక్కువ ఆదాయం గల సీఎంగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రికార్డ్ సాధించారు. సీపీఎం పార్టీకి చెందిన మాణిక్సర్కార్ పేరుపై కేవలం 26 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 30 లక్షలతో రెండో స్థానంలో, జమ్మూకాశ్మీర్ సీఎం మెహబుబా ముఫ్తీ 50 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులను కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ 22 కేసులతో మొదటి స్థానంలో నిలిచారు.