YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ శివ మహాపురాణం - 34

శ్రీ శివ మహాపురాణం - 34

ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.
ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు.  ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చందీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.
ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చందీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.
ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం.

స్నానవిధులేంటి?

ఉత్తమం తు నదీస్నానం, మధ్యమం తు ప్రవాహకమ్
అధమం తు తటాకేన, కూపస్నానమధమమ్

నదీస్నానంఉత్తమం, ప్రవాహంలో స్నానం మాధ్యమం, ఓ తటాకం లో స్నానం అధమమైతే, కూపంలో స్నానం అధమాధమము అని అన్నారు. అలా నదులలో స్నానం చేయడానికి కుదరనివారు ఇంట్లోనే తలస్నానం చేయడం మంచిది. ఇక, మన పూర్వులు ఈ స్నానవిధులను ఆరు రకాలుగా విభజించారు.

నిత్యస్నానం: జప, తప, ధ్యాన, పూజ, పారాయణల నిమిత్తం చేసె స్నానాన్ని ‘నిత్యస్నానం’ అని అంటారు.

నిమిత్తికస్నానం: దోషనివారణ కోసం చేసె స్నానాలను నైమిత్తిక స్నానం అని అంటారు.
కామ్యస్నానం: కొన్ని ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ చేసే స్నానాలు కామ్యస్నానాలు, వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘమాసాలలో చేసే స్నానాలు, యజ్ఞయాగాదులలో చేసే స్నానాలు కామ్యస్నానలే.
క్రియాంగస్నానం: ఆయా సమయాలలో పితృ దేవతల తృప్తి కొరకు చేసే స్నానాలు.
మలాపకర్షణ స్నానం: దీనినే అభ్యంగన స్నానం అని అంటారు. శరీరాన్ని అంటివున్న మురికిని వదిలించుకోవడానికి చేసే స్నానం.

క్రియాస్నానం: పవిత్ర పుణ్యక్షేత్రాలలో చేసే స్నానాన్ని క్రియాస్నానాం అని అంటారు.
కొంతమంది అయ్యితే ఆరోగ్యరీత్యా నీటిలో స్నానం చేయలేనివారై ఉంటారు. మరికొంతమందికి నీటి వనరులు దగ్గర్లోలేనివారై ఉండవచ్చు. అలాంటప్పుడు శరీరశుద్ధికోసం కొన్ని స్నానపద్ధతులను ప్రతిపాదించారు. వీటినే గౌణస్నానాలు అని అంటారు. ఈ గౌణస్నానాలు ఎనిమిది రకాలు:

మంత్రస్నానం: అపోహిష్టాది మంత్రాలతో మార్జనం చేసుకోవడం.

ధ్యానస్నానం: పండితుల పాదాలు కడిగిన జలముతో,

తులసిపాదులో జలంతో ప్రోక్షణం చేసుకోవడం.

భౌమస్నానం: శరీరానికీ విభూతి పూసుకోవడం.

కాపిలస్నానం: తడిగుడ్డతో తుడుచుకోవడం.

ఆగ్నేయస్నానం: త్ర్యాయుషం జమదగ్నేః అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ భస్మంతో మార్జనం చేసుకోవడం.

వాయువ్యస్నానం: ఆవుల డెక్కల వలన ఏర్పడిన గుంటలోని మట్టితో మార్జనం చేసుకోవడం.

దివ్యస్నానం: ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండతో కూడిన వానలో నిలబడివుండటం.

మానసస్నానం: ‘పుండరీకాక్ష’ అనే నామ ధ్యానాన్ని చేస్తూ శుభ్రతను పాటించి

తెల్లవారుఝామున 4-5 గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషిస్నానమని, 5-6 గంటల మధ్య చేసే స్నానం దైవస్నానమని 6-7 గంటల మధ్య చేయు స్నానం మానవస్నానమని, 7 గంటల తరువాత చేసే స్నానం రాక్షసస్నానం అని అంటారు. అందుకనే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఉత్తమమని అంటారు.

నదులలో, ప్రవాహాల్లో, చెరువులలో స్నానం చేస్తున్నప్పుడు, బొడ్డులోతు నీటిలో నిలబడి, శిఖను పాయ తీసి, అంగుష్టాలతో చెవులను, కనిష్టాలతో ముక్కు రంధ్రాలను మూసుకుని, మూడుసార్లు పూర్తిగా మునిగి స్నానం చేయాలి. కట్టుబట్టలతోనే స్నానం చేయాలి. దిగంబరస్నానం చేయరాదు.

సుమంగుళులు నీటిలో మునుగుతూ స్నానం చేయకూడదు. తలజుట్టు విప్పి, దోసిట్లో నీతిని తలపై పోసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత దైవనామ స్మరణ చేస్తూ వస్త్రాలను పిండి, శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇళ్లలో స్నానం చేసేవారికి ఈ నియమాన్నింటినీ పాటించడానికి కుదరదు కాబట్టి శిరః స్నానం చేయడంతో సరిపెట్టుకోవచ్చు...

Related Posts