YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కు లైఫ్ ఇచ్చిన ఎన్నికలు

కాంగ్రెస్ కు లైఫ్ ఇచ్చిన ఎన్నికలు
గెలుపుకోసం మొహం వాచిపోయిన కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పునరుత్తేజాన్ని ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2013 తర్వాత అనేక రాష్ట్రాల్లో వరుసగా అధికారం కాల్పోయి డీలాపడ్డ కాంగ్రెస్‌కు 2019 సాధారణ ఎన్నికలకు ముందు అనుకూలంగా వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహాం నింపాయి. చత్తీస్‌గఢ్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించిన హస్తం పార్టీ, అటు రాజస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకుంది. ఇక, మధ్యప్రదేశ్‌లో మెజార్టీకి రెండు అడుగుల దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఇక్కడ ఇతరుల మద్దతు కీలకం కావడంతో మాయావతి, అఖిలేశ్ యాదవ్‌లు కాంగ్రెస్‌కే జైకొట్టారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రభుత్వాల ఏర్పాటుకు తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మధ్య ప్రదేశ్‌లో మ్యాజిక్ సంఖ్యకు కేవలం రెండు స్థానాల దూరంలోనే కాంగ్రెస్ నిలిచిపోయిన నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతును ఆ పార్టీ కోరింది.తమ పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తున్నట్టు మాయావతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుసరిస్తున్న చాలా విధానాలకు మేము వ్యతిరేకమైనా మధ్యప్రదేశ్‌లో ఆపార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని, రాజస్థాన్‌లో కూడా అవసరమైతే మద్దతుకు సంసిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు..మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై మాయావతి మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని తేలిపోయిందని, తత్ఫలితంగా అక్కడి జనం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు, తాము కూడా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. మాయావతి ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ఈమేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 114 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 109 స్థానాలను గెలుపొందింది. బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 6 చోట్ల విజయం సాధించారు. రెండు రోజుల కిందట కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ తొలిసారిగా నిర్వహించిన సమావేశానికి ఎస్పీ, బీఎస్పీలు గైర్హాజరయ్యాయి. అయితే, ఆ మర్నాడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి, కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ రెండు పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి. సోమవారం జరిగిన సమావేశానికి రాకపోయినా అఖిలేశ్, మాయలు తమవెంటే వస్తారని రాహుల్ నమ్మకంతో ఉన్నారు.

Related Posts