-గురక పెడుతున్న ప్రయాణికుడి చేత జాగారం చేయించారు!
తోటి ప్రయాణికుడొకరు పెడుతున్న గురక ధాటికి చుట్టుపక్కల బెర్త్ల మీదున్న వారెవరికీ కంటిమీద కునుకు రాలేదు. చాలా సేపు ఓపిగ్గా చూశారు. అయినా సరే...గురక జోరు తగ్గలేదు. చివరకు అంతా కలిసి కూడబలుక్కుని గురక పెడుతున్న రామచంద్ర అనే ఆ ప్రయాణికుడిని నిద్రలేపారు. ఆయన మూలంగా కలుగుతున్న ఇబ్బందిని తెలియచేశారు. ఆ సందర్భంగా తీవ్ర వాగ్వివాదాలే జరిగాయి. చివరకు అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. గురక ప్రయాణికుడిని నిద్రపోనీయకుండా కొన్ని గంటలపాటు ఆపగలిగితే అక్కడున్న మిగిలిన వారంతా కాసేపు నిద్రపోవచ్చనుకున్నారు. అదే విషయాన్ని ఆయనకు చెప్పారు.
కోపాలు...వాగ్వాదాలు...నచ్చచెప్పడాలు...బెదిరింపులూ అన్నీ అయ్యాక రామచంద్ర సాటి ప్రయాణికుల మాట విని...ఓ అయిదారుగంటల పాటు నిద్రపోకుండా అలాగే మేలుకుని ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జబల్పూర్ స్టేషన్లో విధినిర్వహణకు వచ్చిన గణేశ్ వి. విర్హా అనే టికెట్ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రామచంద్ర ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు. తనను నిద్రపోనివ్వకుండా అడ్డుకున్న ప్రయాణికులపై ఫిర్యాదు చేయలేదన్నారు. తెల్లారేసరికి అంతా కలిసి కబుర్లు చెప్పుకొన్నారన్నారు. ఈ ఘటన ఇటీవల ఎల్టీటీ-దర్భంగా పవన్ ఎక్స్ప్రెస్ రైలు త్రీటైర్ ఏసీ బోగీలో చోటు చేసుకుంది.