YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుమార స్వామి నిర్వాకంతో నెట్టింట్లో అభాసు పాలు

కుమార స్వామి నిర్వాకంతో  నెట్టింట్లో అభాసు పాలు
ప్రస్తుతం ఫోర్ జి యుగం నడుస్తుంది. త్వరలోనే ఫైవ్ జి లోకి అడుగుపెట్టబోతున్నాం. అయినా కొందరు నేతలు అప్ డేట్ కాకపోవడం వారి కొంపనే ముంచుతుంది. ఇదంతా దేనికి అంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి నిర్వాకం నేటి నెట్ యుగానికి అనుసంధానం కాకపోతే వాటిల్లే నష్టాన్ని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.అధికారంలో ఉన్నాం కదా… మన మీడియా మనకు ఉందని… ఏమి కాదనుకునే వారికి కుమారస్వామి ఉదంతం చక్కటి హెచ్చరికే . తమ పార్టీ నేత ప్రకాష్ ను దుండగులు చంపిన సమాచారం తెలిసి కుమార స్వామి తనెక్కడ ఉన్నానో మర్చిపోయారు. చుట్టూ పలువురు నేతలు, పోలీసులు, మీడియా ఉన్నారన్న స్పృహ కూడా కోల్పోయారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ తరహాలో నిందితులెవరైనా కాల్చేయండి, షూట్ చేసి పాడేయండి అనే ఆదేశాలను ఒక పోలీస్ అధికారికి ఇవ్వడం అది చుట్టూ వున్న వారిలో ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ఆయన పరువు తీసింది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా అనుభవాలను కుమారస్వామి పూర్తిగా చవి చూడక పోవడంతో బాటు మారుతున్న సాంకేతిక విజ్ఞానికి అప్ డేట్ అయ్యి జాగ్రత్త పడకపోవడం అన్నది స్పష్టం అయిపోతుంది.ఈ ఏడాది వచ్చిన కర్ణాటక వరదల్లో కుమారస్వామి సోదరుడు రేవణ్ణ వరదబాధితులకు ఆహార పదార్ధాలను కుక్కలకు విసిరినట్లు విసిరారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యి జేడీఎస్ పరువు నెట్టింట్లో అభాసు పాలైంది. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియా వేదికలపై చక్కెర్లు కొడుతూనే వుంది. అది ఇంకా మరిచిపోకముందే తాజాగా కుమారస్వామి తన వ్యాఖ్యలతో నెటిజెన్ల నోట్లో పడటమే కాదు ప్రతిపక్షాలకు ఐటెం గా మారారు.శాంతి భద్రతలు కాపాడాలిసిన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం క్షమించరాదని అంతా విమర్శలు ఎక్కుపెట్టారు. సభ్య సమాజానికి తన వ్యాఖ్యల ద్వారా కుమారస్వామి ఏమి సందేశం ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు జేడీఎస్ కి ఇబ్బందిని తెచ్చి పెట్టాయి. ఇటీవల దేశంలో సోషల్ మీడియా ప్రభావంతో అనేకమంది నేతలు అభాసుపాలయ్యారు. తమ చుట్టూ నిఘా నేత్రాలు ఉన్నాయని సెలబ్రిటీ హోదాలో వున్నవారు మర్చిపోతే పదవులే ఉల్టా పల్టా అవుతాయని మర్చిపోతే ఎలా ..?

Related Posts