YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో ముదిరిన విబేధాలు దేవగౌడతో బాబు మధ్యవర్తిత్వం

కర్ణాటకలో ముదిరిన విబేధాలు దేవగౌడతో బాబు మధ్యవర్తిత్వం
సాధారణ ఎన్నికలకు మరో నాలుగు నెలలు సమయం ఉండటంతో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొంత ఇబ్బందిగా మారింది. దీనికి జేడీఎస్ వ్యవహార శైలే కారణం. అయితే, ఈ సమస్య పరిష్కరించే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు కాంగ్రెస్ అప్పగించింది. మరోవైపు, జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోన్న చంద్రబాబు, అన్ని పార్టీలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పవార్, ఫరూక్ అబ్దుల్లా, చంద్రబాబులు జనవరి మూడో వారంలో సమావేశమై కూటమి ఏర్పాటుపై రోడ్ మ్యాప్ గురించి చర్చించనున్నారు. ఇదే అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేసే హక్కు ప్రాంతీయ పార్టీలకు ఉందని అన్నారు. సంబంధిత భాగస్వామ్య పార్టీలతో చర్చించి, లోక్‌సభ ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ తయారీకి ముందే ఈ సమస్యను పరిష్కరిస్తారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌- జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం పదవులను 2:1 నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విధానం అనుసరించాలి. కానీ, దీన్ని మీరి జేడీఎస్ పార్టీ ఎక్కువ సీట్లలో పోటీచేస్తామని అంటోంది. ఇప్పుడున్న ఒప్పందం ప్రకారం కర్ణాటకలోని మొత్తం 28 ఎంపీ సీట్లలో జేడీఎస్ 10, కాంగ్రెస్ 18 చోట్ల పోటీచేయాలి. అయితే, జేడీఎస్ మాత్రం తాము 12 స్థానాల్లో తప్పకు పోటీచేస్తామని ప్రకటించింది. ఈ అంశంపై ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవగౌడ మాట్లాడుతూ.. తమ పార్టీ 12 చోట్ల పోటీ చేస్తుందని, ఇందులో ఏలాంటి సందేహం లేదని అన్నారు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే స్నేహపూర్వక పోటీకి కూడా సిద్ధమేనని తెలిపారు. ఏదైనా జాతీయ కూటమిలోని భాగస్వామ్యంగా ఉన్న ప్రాంతీయ పార్టీగా ఉనికి, సామర్ధ్యాన్ని నిరూపించుకోడానికి ఇది ఎంతో ముఖ్యమని దేవెగౌడ వ్యాఖ్యానించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేవెగౌడ ప్రకటనతో కాంగ్రెస్‌ కొంత ఇరకాటంలో పడింది. అంతేకాదు, ప్రస్తుతం చిక్‌బళ్లాపుర, తుముకూరు పార్లమెంటు స్థానాన్ని కూడా జేడీఎస్ ఆశిస్తోంది. ఇక్కడ నుంచి తమ కుటుంబసభ్యులను పోటీకి దింపాలనే ఆలోచనలో మాజీ ప్రధాని ఉన్నారు. ఈ రెండూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కాదు, చిక్‌బల్లాపూర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ పార్టీ డిమాండ్లైనా సమంజసంగా ఉండాలని, కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై చివరిగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటుందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళతో సహా కర్ణాటకలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ దృష్టిసారించింది. 

Related Posts