YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

వ్యవసాయానికి పెద్దపీట 

Highlights

  • ప్రత్యేక బడ్జెట్ కి చర్యలు 
  • రెండు రోజుల రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులు 
  • 25న  వ్యవసాయ విశ్వ విద్యాలయం
  • 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం 
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం 
వ్యవసాయానికి పెద్దపీట 

దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనన్ని కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్నదని  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఈ ఏడాది నుంచి మరిన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నందున ఎక్కడా నిధుల సమస్య రాకుండా ఉండేందుకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అనుగుణంగా ముసాయిదా తయారు చేయాలని చెప్పారు. ప్రగతి భవన్ లో ఆదివారం వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశం లో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపిలు గుత్త సుఖేందర్ రెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులను ఈ నెల 25,26 తేదీల్లో  నిర్వహించాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారు.  వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేర్చే విషయంలో రైతు సమన్వయ సమితిలు నిర్వహించాల్సిన పాత్రకు సంబంధించిన ఈ సదస్సుల్లో సభ్యులకు వివరించనున్నట్లు వెల్లడించారు. 25న హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున దీనికి సంబంధించిన ముసాయిదా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పంట పెట్టుబడి మద్దతు పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో రెండు విడతలుగా అందించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై నాట్లేసే యంత్రాలు అందివ్వాలని యోచిస్తున్నట్లు సిఎం తెలిపారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, వ్యవసాయ రంగాభివృద్ధికోసం కృషి చేస్తున్న నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితిని త్వరలోనే నియమిస్తామని సిఎం ప్రకటించారు. 

ఈ నెల 25న హైదరాబాద్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరిగే ప్రాంతీయ సదస్సుకు జనగామ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మండల రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించాలని సిఎం ఆదేశించారు. ఈ నెల 26న కరీంనగర్ లో జరిగే ప్రాంతీయ సదస్సుకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు చెందిన సభ్యులను ఆహ్వానించాలని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సద్సులో ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రుల సందేశాలతో పాటు రైతులతో ముఖ్యమంత్రి నేరుగా సంభాషించే కార్యక్రమాలుంటాయి. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ది కోసం ప్రభుత్వ చేపట్టిన  అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమాల్లో రైతు సమన్వయ సమితిల సభ్యులు ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై ఈ సదస్సుల్లో కూలంకశంగా చర్చించనున్నట్లు సిఎం చెప్పారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు కూడా ఈ సదస్సుల్లో పాల్గొంటారని వెల్లడించారు. సదస్సులకు హాజరయ్యే మండల రైతు సమన్వయ సమితుల సభ్యుల ప్రయాణ, భోజన సదుపాయాలన్నీ వ్యవసాయ శాఖ సమకూర్చాలని సిఎం చెప్పారు. రైతులను సంఘటితం చేయడం, రైతు వేదికల నిర్మానం-నిర్వహణ, రైతులకు నిరంతర శిక్షణ, పంట పెట్టుబడి మద్దతు పథకం, పంటలకు కనీస మద్దతు ధర అందేలా చూడడం, మార్కెట్లకు ఉత్పత్తులు తీసుకువచ్చే విషయంలో నియంత్రణ పాటించడం, మేలైన సాగు పద్దతులు, శాస్త్రీయ వ్యవసాయ విధానం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజి చైన్, క్రాప్ కాలనీలు తదితర అంశాల్లో రైతు సమన్వయ సమితిలు నిర్వహించాల్సిన పాత్రపై కరదీపిక అందించడంతో పాటు, సదస్సుల్లో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించాలని సిఎం చెప్పారు. 
42 మంది సభ్యులతో త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులతో పాటు వ్యవసాయ శాఖాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులను కూడా కమిటీలో సభ్యులుగా నియమించనున్నట్లు సిఎం చెప్పారు. వ్యవసాయ రంగాభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న వారిని సభ్యులుగా నియమించాలని, దీనికోసం పేర్లు సూచించాలని సిఎం అధికారులను కోరారు. 
పంటకు పెట్టుబడి మద్దతు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. వర్షాకాలం పంట వేసుకోవడానికి ఎకరానికి 4వేల చొప్పున అందించే కార్యక్రమాన్ని ఏప్రిల్  20 నాడు ప్రారంభించాలని చెప్పారు. యాసంగి పంట కోసం ఇచ్చే పెట్టుబడి పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 18 నుంచి నిర్వహించాలని చెప్పారు. దీనికి సంబంధించిన నిధులను బడ్జెట్ లోనే కేటాయించనున్నట్లు సిఎం  ప్రకటించారు. 
ప్రస్తుతం వ్యవసాయదారులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని సిఎం అన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వరినాట్లు వేసే యంత్రాలను సబ్సిడీపై అందించాలని సిఎం నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 
 

Related Posts