YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

100 కోట్లతో బాల్ థారకే స్మారకం

100 కోట్లతో బాల్ థారకే స్మారకం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన మిత్రులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేపట్టింది. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే అంటీ ముట్టనట్లుగా వ్యవహరించే శివసేనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే స్మారక నిర్మాణం కోసం రూ.100కోట్లు కేటాయిస్తూ కేబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ మాట్లాడుతూ.. బాల్ థాకరే కేవలం శివసేన నాయకుడు మాత్రమే కాదని, మహారాష్ట్రీయులకు ఆరాధ్యుడని అన్నారు. ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు స్మారకం నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎమ్ఎమ్ఆర్‌డీఏ) సంయుక్తంగా రూ.100కోట్లు ఖర్చుచేస్తాయని తెలిపారు. తమ ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేనకు బీజేపీ ఇస్తున్న గౌరవంగా దీన్ని భావించాలని సుధీర్ అన్నారు. ఈ నిర్ణయంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తు మరింత బలపడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలపై కేబినెట్ సమావేశంలో శివసేన మంత్రులు ప్రశంసలు కురిపించారని తెలిపారు. బాల్ థారకే స్మారకాన్ని శివాజీ పార్క్ సమీపంలో ముంబయి మేయర్ బంగ్లా ప్రాంతంలో సముద్ర ముఖంగా నిర్మించనున్నారు. 11500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్మారకం నిర్మాణం పూర్తికాగానే ‘బాలాసాహెబ్ థాకరే రాష్ట్రీయ సమర్క్ న్యాస్’ ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం అరేబియా సముద్ర ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిర్మిస్తోంది. దీనికోసం రూ.3,643 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

Related Posts