
పద్మ శ్రీ పురస్కారానికి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారనే సంగతి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్లో జన్మించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీకి తెలంగాణ కోటాలో పద్మ శ్రీకి ఎంపిక చేశారు. వీరే కాకుండా ఒడిశా కోటా నుంచి మరో తెలుగు వ్యక్తి పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన పేరు దేవరపల్లి ప్రకాశ్ రావు. ఒడిశాలోని కటక్లో టీ స్టాల్ నడుపుతూ సాధారణ జీవనం సాగించే ఆయన.. సేవాగుణంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ప్రకాశ్ రావు పూర్వీకులు ఒడిశాలో స్థిరపడ్డారు. కటక్లోని బక్సీ బజార్ ప్రాంతంలో ఆయన టీ స్టాల్ నడుపుతున్నారు. ఆ బస్తీలో ఉండేవాళ్లంతా పేదలే. అక్కడ పిల్లలు చదువకోవడానికి కనీసం స్కూల్ కూడా లేకపోవడంతో.. తన ఇంట్లోని రెండు గదుల్లో ఒక గదిని స్కూల్గా మార్చేశారు. రోజూ టీ, రొట్టెలు, వడలు విక్రయించగా వచ్చే రూ.600 ఆదాయంలో సగాన్ని పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం నిలిచిపోయినా.. తన కుటుంబ ఖర్చులను తగ్గించుకొని మరీ ప్రకాశ్ రావు పిల్లలను చదివిస్తున్నారు. మొదట్లో వారి తల్లిదండ్రుల నుంచి ప్రతిఘటన ఎదురైనా చదువు ప్రాధాన్యాన్ని వారికి వివరించి నచ్చజెప్పాడు. తన ఇద్దరు కూతుళ్లను చదివించి వారికి మంచి జీవితాన్ని అందించిన ఈయన తన బస్తీలోని పిల్లల బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. వారికి చదువు చెబుతూ.. ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్ ఇస్తున్నారు. వారికి భోజనం కూడా పెడుతున్నారు. పిల్లలను చదివించడమే కాదు.. ప్రకాశ్ రావు రక్తదానం చేసి ఎందరో జీవితాలను కాపాడారు. 40 ఏళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరగ్గా రక్తం అవసరమైంది. ఎవరో ఒకాయన వచ్చి రక్తం ఇచ్చి వెళ్లిపోయారట. తాను బతికి ఉన్నానంటే రక్తదానమే కారణమని నమ్మే ఆయన.. ఎవరికి రక్తం అవసరమైనా వెంటనే వెళ్లి ఇచ్చి వస్తుంటారు. నలభై ఏళ్లలో ఇప్పటి వరకూ 200సార్లకుపైగా రక్తదానం చేశారు. 17సార్లు పేట్లెట్స్ దానం చేశారు. రోజూ సమీపంలోని హాస్పిటల్కు వెళ్లి పేద రోగులకు తోచిన సాయం చేస్తుంటారు.