YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

గులాబీ గూటికి ఉపాసన

గులాబీ గూటికి ఉపాసన

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కీలకమైన నాలుగు ఎంపీ సీట్లపై దృష్టి సారించింది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నల్లగొండ లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని వ్యూహరచన చేస్తోంది. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి, తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మైనంపల్లిని మల్లారెడ్డి ఓడించారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మైనంపల్లి హన్మంతరావు విజయం సాధించారు. ఇద్దరు నేతలూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో పార్లమెంటుకు బలమైన అభ్యర్థి కోసం అధికార పార్టీ అన్వేషిస్తోంది. అలాగే, గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కొండా విశ్వేశ్వరరెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానం చేజారిపోకూడదని టీఆర్ఎస్ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇక్కడ నుంచి శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ను పోటీకి దింపాలని తొలుత భావించింది. అయితే, ప్రస్తుతం ఆ ఆలోచన కేసీఆర్ విరమించుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించాలంటే బరిలో నిలబడే అభ్యర్థికి ఆర్థిక, సామాజిక బలం కూడా అవసరమని నమ్ముతోంది. అందుకే చేవెళ్ల నుంచి చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసనను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వేశ్వరరెడ్డికి ఉపాసన బంధువు కూడా కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని అగ్రనేతలు భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఉపాసన కుటుంబంతోపాటు పవన్ కల్యాణ్‌తోనూ కేటీఆర్‌కు సత్సంబంధాలున్నాయని అంటున్నారు. అవసరమైతే మల్కాజిగిరి, చేవేళ్లలో పవన్ కల్యాణ్ సహకారం తీసుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి ఈ సీటును ఇస్తామని టీఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చినట్టు ప్రచారం కూడా సాగుతోంది. కానీ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కార్తీక్ రెడ్డికే ఈసారి ఆ పార్టీ టిక్కెట్టు కేటాయిస్తుందని కొందరంటున్నారు. చివరికి, విశ్వేశ్వరెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గుచూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి 1.44 లక్షల ఓట్లతో నాలుగో స్థానంలో నిలవగా, టీడీపీ మద్దతుతో బీజేపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం ఇక్కడ తామే విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఇక్కడ బరిలో నిలిచింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థికి ఆ పార్టీ మద్దతు ఉంటుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోని ఆరింటిని టీఆర్ఎస్ గెలుపొందింది. నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పోటీకి సముఖంగా లేనట్టు సమాచారం. అందుకే ఇక్కడ నుంచి కేటీఆర్ పోటీచేస్తారని అలా కాని పక్షంలో రాజేశ్వర్ రెడ్డి, సుఖేందర్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. 

Related Posts