YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పుల్వామా దాడితో పాక్ ఇరకాటం

పుల్వామా దాడితో పాక్ ఇరకాటం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
పుల్వామా ఉగ్రదాడి అనంతరం అన్ని వేళ్లూ పాక్‌వైపే చూస్తుండటంతో దాయాది ఇరకాటంలో పడింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్థాన్ కంటితుడుపు చర్యలు చేపట్టింది. పుల్వామా దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. బహావల్‌పూర్‌లో ఉన్న మౌలానా మసూద్ అజార్ కార్యాలయాన్ని పంజాబ్ ప్రావిన్సుల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదురి ప్రకటించారు. అయితే, ఈ స్థావరం నుంచి మసూద్ అజార్ రెండు రోజుల కిందటే తరలిపోవడం గమనార్హం. జైషే మహ్మద్ సంస్థకు కీలకమైన ఈ స్థావరం ఇప్పటి దాకా ఆర్మీ భద్రతలోనే ఉంది. పుల్వామా దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలి, ఎఫ్‌ఏటీఎఫ్‌‌లు ప్రకటనల వెలువడిన అనంతరం పాకిస్థాన్ ఈ చర్యలకు ఉపక్రమించింది. దీంతో గతంలోనూ ముంబై దాడుల అనంతరం లష్కరే తొయిబా స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నా, ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. కేవలం అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతోన్న ఒత్తిడి నుంచి తప్పించుకోడానికే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు అందే నిధులపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాకిస్థాన్‌కు గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, జమాతుద్ దవా లాంటి తీవ్రవాద సంస్థలకు నిధులను అందకుండా చూడటంలో పాక్ విఫలమైందని ప్రకటించింది. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జైషే మహ్మద్ సంస్థ లాంటి ఉగ్రవాద శిబిరాలకు వెన్నుదన్నుగా నిలిచే పాక్, మసూద్ అజార్ ప్రధాన స్థావరం స్వాధీనం చేసుకున్నా అదేమీ తీవ్రమైన చర్య కాదు, వారికి ఎలాంటి నష్టం ఉండదు. దీనికి లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధమే ఉదాహరణ. బహావల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయమైన మద్రస్థుల్ సబీర్, జమీ ఈ మసీద్ సుభానల్లాహ్‌ను పంజాబ్ ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుందని, ఆ రాష్ట్ర పోలీసులు వీటిని తమ చేతుల్లోకి తీసుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన పాకిస్థాన్ జాతీయ భద్రతా మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో 600 మంది విద్యార్థులు ఉండగా, 70 ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాదు, జమాత్ ఉద్దవ్, ఫలాహ్ ఇ ఇన్సానత్ ఫౌండేషన్ ఉగ్రవాద సంస్థలపై కూడా నిషేధం విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ఆయన తెలిపారు.

Related Posts