YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పురుష కమిషన్ తీసుకరావాలి :భార్య బాధితుల డిమాండ్

పురుష కమిషన్ తీసుకరావాలి :భార్య బాధితుల డిమాండ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గృహహింస కింద మహిళలకు మాత్రమే వర్తించే చట్టాలున్నాయని.. ఇందులో మగాళ్లకు కూడా అవకాశం కల్పించాలని భార్యా బాధితులు డిమాండ్ చేస్తున్నారు..మహిళలకు రక్షణగా ఉన్న గృహహింస కఠిన చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తూ పురుషులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసుల పేరుతో పురుషులను నానా విధాలుగా చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటనలు సమాజంలో కోకోల్లలు. మహిళలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ముందుకొస్తుంది. మరి పురుషుల అన్యాయమైపోతే ఎవరూ దిక్కులేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే ఇప్పుడు కొత్తగా పురుష కమిషన్ రావాలనే డిమాండ్ దేశంలో ఊపందుకుంది. తాజాగా ఢిల్లీలో పురుష కళ్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మహిళలు పెడుతున్న హింసవల్ల చాలా మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుల సమస్యల పరిష్కారం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని.. పురుష కమిషన్ ఏర్పాటు అయ్యే వరకు తాము ఉద్యమిస్తామని వారంతా స్పష్టం చేశారు. అంతేకాదు కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన పురుషుల బొమ్మ ఆకట్టుకుంది. వారు అనుభవిస్తున్న వేధింపులకు చిహ్నంగా నిలిచింది.. పురుష బాధితులకు గుర్తుగా గాయపడిన భీష్ముడిని ప్రతిబింబిచేలా బొమ్మను తయారు చేశారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పురుష కళ్యాణ్ ట్రస్ట్ పురుష బాధితుల కోసమే ప్రత్యేకంగా 2005లో ప్రారంభమైంది. కొందరు మహిళలు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. పురుషులు చేసిన ఈ ఆందోళనలో కూడా వారు పాల్గొనడం విశేషం. గృహహింస కింద కొందరు మహిళలు పురుషులపై తప్పుడు కేసులు పెడుతున్నారని దీనిపై న్యాయపోరాటం చేసి గెలిచామని ట్రస్ట్ సభ్యురాలు తెలిపారు. మహిళలకు పురుషులకు ఇరువురికి సమానమైన చట్టాలుండాలని.. ఇందుకోసం పురుష కమిషన్ ఏర్పాటే పరిష్కారం అని వారు డిమాండ్ చేశారు. ఇలా భార్య బాధితులు సంఘంగా ఏర్పడి ఢిల్లీలో గోడు వెళ్లబోసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

Related Posts