YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

253కు తగ్గిన శ్రీ లంక పేలుళ్ల మృతులు

253కు తగ్గిన శ్రీ లంక పేలుళ్ల మృతులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కొలంబో పేలుళ్లలో దుర్మరణం పాలైన వారి సంఖ్యను తగ్గిస్తూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (ఏప్రిల్ 21) ఈస్టర్ సందర్భంగా కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు. 
భయంకరమైన పేలుళ్లలో చాలా మంది పర్యాటకుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయని.. దీంతో అధికారులు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులుగా లెక్కించారని వివరించారు. అంతేకాకుండా మృతుల సంఖ్య విషయంలో పలు ఆస్పత్రులు కూడా సరైన గణాంకాలు ఇవ్వలేదని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా శరీర భాగాలన్నింటినీ గుర్తించిన తర్వాత పేలుళ్లలో మరణించివారి సంఖ్య 253గా తేలిందని అధికారులు తెలిపారు. కొలంబో పేలుళ్ల విషయంలో రక్షణ శాఖ వైఫల్యం ఉందని అంగీకరించిన శ్రీలంక ప్రభుత్వం.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రదాడులకు సంబంధించి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నప్పటికీ.. అప్రమత్తమవడంలో విఫలం చెందినట్లు తెలిపారు. కొలంబోలో మొత్తం 8 ప్రదేశాల్లో ముష్కరమూకలు మారణహోమం జరిపారు. ఈ దాడుల్లో 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
కొలంబో పేలుళ్లకు సంబంధించి శ్రీలంక పోలీసులు మొత్తం 70 మంది అదుపులోకి తీసుకొని విచారిస్తు్న్నారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగా కొలంబోలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డట్టు ఆ దేశ రక్షణ మంత్రి ఇంతకుముందే తెలిపారు. పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఘటనలో తన వైఫల్యం ఏదీ లేదని తెలిపారు.శ్రీలంకకు చెందిన ముస్లిం సంస్థలు.. నేషనల్ తౌహీద్ జమాత్, జమ్మియాతుల్ మిలాత్ ఇబ్రహింలకు కొలంబో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారందరినీ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో బాగా చదువుకున్నవారు, ధనవంతులు కూడా ఉన్నట్లు తెలిపారు. శ్రీలంకలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సుగంధద్రవ్యాల వ్యాపారి ఇద్దరు కుమారులు కూడా ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఉన్నట్లు చెబుతున్నారు

Related Posts