YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మావోలు పంజా 15 పోలీస్ కమాండోలు దుర్మరణం

మావోలు పంజా 15  పోలీస్ కమాండోలు దుర్మరణం

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మావోలు పంజా విప్పారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు 15 మంది పోలీస్ కమాండోలు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి పోలీసు వాహనం తునాతునకలైంది. జముర్‌ఖేడా సమీపంలోని కుర్ఖేడాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది కమాండోలు ప్రయాణిస్తున్నారని సమాచారం. మందుపాతర పేల్చిన ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు ఉన్నారని భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. మంగళవారం రాత్రి గడ్చిరోలి జిల్లాలోని పురాడాలో నిర్మాణాలు జరుగుతోన్న ప్రాంతంలో 36 మెషిన్లు, వాహనాలను మావోలు తగలబెట్టారు. మహారాష్ట్ర పోలీస్ కమాండోలతో కూడిన క్విక్ రెస్పాన్స్ టీం ప్రయివేట్ వాహనంలో ఈ ప్రాంతానికి వెళ్తుండగా.. మావోలు పక్కా ప్లాన్‌తో పేల్చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్చిరోలిలో భద్రతా దళాల సిబ్బందిని మావోలు పొట్టనబెట్టుకోవడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. అమరుల త్యాగాలను దేశం మర్చిపోదన్నారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమన్నారు

వీరజవాన్లకు సెల్యూట్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు భద్రతాబలగాల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సహా 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గడ్చిరోలిలో సీ-60 కమాండోలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నా. హింస కారణంగా ఇప్పటివరకూ ఎవరూ దేన్నీ సాధించలేకపోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా. అమరులైన జవాన్ల కుటుంబాలతో మిగతా దేశ ప్రజలతో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఐఈడీ పేల్చిన మావోలను పట్టుకునేందుకు బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి.

Related Posts