YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

11 మంది చిన్నారులను చంపేసిన ముఠా

11 మంది చిన్నారులను చంపేసిన ముఠా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బిహార్ షెల్టర్ హోమ్ అత్యాచారాల కేసులో దారుణమైన సంచలనం వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌ బాలికల ఆశ్రయ కేంద్రంలో నుంచి అదృశ్యమైన 11 మంది బాలికలను హత్య చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితుడైన బ్రజేష్‌ ఠాకూర్‌.. ఆ బాలికలను దారుణంగా హత్య చేశాడని సీబీఐ శుక్రవారం (మే 3) సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్రజేష్‌ ఠాకూర్, అతడి సహచరులు కలిసి చిన్నారులను హత్యచేసి పూడ్చి పెట్టారని.. ఆ ప్రాంతం నుంచి ఎముకల పోగులను తవ్వి తీసి స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వెల్లడించింది. ఆశ్రమంలో బాధిత బాలికలు తెలిపన వివరాల ప్రకారం.. ఆ 11 మంది బాలికల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో వివరించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్‌లో 40 మంది బాలికలను చిత్రహింసలకు గురిచేస్తూ అత్యాచారాలకు పాల్పడిన ఉదంతం గతేడాది వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా దీనిపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకాయి. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీబీఐ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. అనాథాశ్రమం పేరుతో హాస్టల్‌లో సాగిన దారుణాల గురించి బాధిత బాలికలు.. నాడు విచారణ అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. హాస్టల్‌లో 42 మంది బాలికలు ఉండగా.. 32 మందిపై అత్యాచారం జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. వీరంతా 8 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవాళ్లే కావడం మరింత విచారకరం. వాళ్లు విపరీతంగా కొట్టేవాళ్లు, బెదిరించేవాళ్లు, ఆపై అత్యాచారం చేసేవాళ్లు.. బలవంతంగా మా దుస్తులు విప్పదీసి చాలాసేపు నగ్నంగా కూర్చోబెట్టేవాళ్లు.. తిండి పెట్టకుండా హింసించేవాళ్లు.. కడుపులో తన్నేవాళ్లు..’ అంటూ ఓ బాలిక చెప్పింది. కీచకులు పెట్టే బాధలు భరించలేక గాజు ముక్కలతో ఒళ్లంతా కోసుకునేవాళ్లమని, సరైన ఆహారం పెట్టకుండా కడుపును మలమలా మాడ్చి, మత్తు మందు కలిపిన తిండి పెట్టి అఘాయిత్యానికి పాల్పడేవారని దర్యాప్తు అధికారితో మరో బాలిక గోడు వెళ్లబోసుకుంది. ఉదయం లేచే సరికి ఒళ్లంతా నొప్పులతో అల్లాడిపోయేవాళ్లమని ఆమె చెప్పింది. బాలికలకు రక్షణ కల్పించే పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసిన బ్రజేష్ ఠాకూర్ ఈ కేసులో కీలక నిందితుడు. అతడు తనను కలవడానికి వచ్చే అతిథుల కోరికలను తీర్చడానికి ఈ బాలికలను వారి వద్దకు పంపించేవాడని విచారణలో తేలింది. అనాథ గృహంలోని బాలికలతో బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించడమే కాదు, వారిని బెదిరించి లైంగిక వాంఛలను తీర్చుకున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. భోజ్ పూరీ పాటలకు బాలికలతో నృత్యాలు చేయించి, బలవంతంగా ఒంటిపై దుస్తులు తీయించి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవారని తెలిసింది. ‘రాత్రి భోజనం తిన్నాక మత్తుగా ఉండటంతో వెంటనే నిద్రపోయేవాళ్లం. ఉదయం లేచే సరికి నోట మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. మాపై అత్యాచారాలు చేస్తున్నారని తెలుసు. పారిపోదామంటే కూడా ఓపిక ఉండేది కాదు. గదికి కిటికీలు కూడా లేవు’ అంటూ ఓ బాలిక కంటతడి పెట్టింది. మత్తుగా ఉండటంతో కళ్లు మూతలు పడేవని.. కానీ, వాళ్లు కడుపులో తన్నుతూ రాక్షసంగా ప్రవర్తించేవాళ్లని మరో బాలిక చెప్పింది. హాస్టల్‌లో ఆయాలు మీకు సహకరించలేదా అని దర్యాప్తు అధికారి ప్రశ్నించగా.. బ్రజేష్ వాళ్లందరినీ బెదిరించేవాడని, కొంత మందిపై చేయి కూడా చేసుకున్నాడని తెలిపారు. కొంత మంది ఆయాలు తమను తప్పు దోవ పట్టించేవారని, వాళ్ల కోరికలు తీరిస్తే సుఖపడతామంటూ బలవంతం చేసేవారని బాలికలు చెప్పారు. ఆశ్రమంలో ఉండే మరో వ్యక్తి తమపై అఘాయిత్యం చేయడానికి వస్తుంటే.. ఆయన భార్య బయటకి వెళ్లిపోయేది అని మరో బాలిక చెప్పింది. తాము చాలాసార్లు వేడుకున్నామని, కూతుళ్ల లాంటి వాళ్లమని ప్రాధేయపడ్డామని బాలికలు తెలిపారు. శరీరం సహకరించకున్నా ఓ వ్యక్తి తమపై అఘాయిత్యం చేసేవాడని వారు చెప్పారు.

Related Posts