YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బంగ్లాదేశ్ వైపు కదులుతున్న ఫణి

బంగ్లాదేశ్ వైపు కదులుతున్న ఫణి
ఒడిశాలో బీభత్సం సృష్టించిన ప్రచండ తుఫాన్ ‘ఫణి’ క్రమంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌ దిశగా కదులుతోంది. శుక్రవారం (మే 3) అర్ధరాత్రి తర్వాత ఒడిశాలోని బాలసోర్‌ మీదుగా బెంగాల్‌ను ఫణి తాకింది. తుఫాన్ కారణంగా బెంగాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ తర్వాత క్రమంగా తీవ్రతను తగ్గించుకుంటూ బంగ్లాదేశ్‌ దిశగా తుఫాన్ కదులుతోంది. తుఫాన్ కోల్‌కతాను తాకిన సమయంలో గంటకు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన భయానక తుఫాన్‌కు ఈసారి బంగ్లాదేశ్ నామకరణం చేసింది. దీనికి ‘ఫణి’ తుఫాన్‌ అని పేరుపెట్టారు. బెంగాలీ భాషలో దీనికి ‘పాము పడగ’ అని అర్థం. ఒడిశాపై పడగ విప్పిన ఈ తుఫాన్.. ఆ తర్వాత పాములా దిశను మార్చుకుంటూ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. శనివారం సాయంత్రం లోగా బంగ్లాదేశ్‌ను తుఫాన్ తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రం అసోంను తాకొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. బంగ్లాదేశ్‌పై ఫణి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని చెబుతున్నారు. బంగ్లాదేశ్ తీరాన్ని తాకే సమయానికి గాలులు వేగం 60 కి.మీ. కంటే తక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీకి దక్షిణాన శుక్రవారం ఉదయం తీరం దాటిన ప్రచండ తుఫాన్ ఫణి.. ఆ రాష్ట్రంలో బీభత్సం చేసింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటలకు 200 కి.మీ. వేగంతో గాలులు వీశాయి. ఈ పెను గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ క్రేన్లు, బస్సులు సహా పలు వాహనాలు తిరగబడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వేలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. తుఫాన్ కారణంగా ఒడిశాలో 12 మంది మరణించారు. బెంగాల్‌లో తుఫాన్ ప్రభావంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠితో మాట్లాడినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని మోదీ చెప్పారు. ఇప్పటికే ఈస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లా నుంచి 15 వేల మంది, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లా నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఈదురుగాలులు, వర్షం నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. పట్టాలపై చెట్లు విరిగిపడటం, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 

Related Posts