YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రష్యాలో విమానం ఎమెర్జెన్సీ ల్యాండింగ్ 41 మంది మృతి

రష్యాలో విమానం ఎమెర్జెన్సీ ల్యాండింగ్  41 మంది  మృతి
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటనలో 41 మంది మృతిచెందారు. రష్యాకు చెందిన ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్‌జెట్ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్లు మాస్కో విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించారు. విమానం దిగే సమయంలో వెనుక భాగం నేలను తాకడంతో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలోనే ప్రయాణికులను ముందు వైపునకు రావాలని పైలట్లు సూచించారు. చాలామంది ప్రయాణికులు గందరగోళానికి గురికావడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. విమానంలో మొత్తం 78 మంది ఉండగా 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు రష్యన్ అధికారులు తెలిపారు. రష్యన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.50 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కిందికి దిగాలని విమాన సిబ్బంది ప్రయాణికులకు సూచించినా వినకుండా లగేజీ కోసం వేచి చూశారని దీనివల్లే ఎక్కువ మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. విమానంలో ఎలాంటి సాంకేతికలోపం తలెత్తిందన్న దానిపై విమానాశ్రయ అధికారులు స్పష్టం చేయడం లేదు. టేకాఫ్ తీసుకున్న తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు విమానం మాస్కో పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టినట్లు ‘ఫ్లైట్ రాడార్ 24’ ప్రతినిధులు వెల్లడించారు. విమానం తోక భాగంలో పిడుగు పడటం వల్లనే మంటలు చెలరేగినట్లు రష్యన్ వార్తా సంస్థ టాస్ చెబుతోంది. దీనిపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. దట్టమైన నల్లటి పొగతో నిప్పులు చిమ్ముకుంటూ విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 

Related Posts