YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏడాది జీతాన్ని విరాళం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం

ఏడాది జీతాన్ని విరాళం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం

చండ తుఫాన్ ‘ఫణి’ ధాటికి తీర రాష్ట్రం ఒడిశా కుదేలైన విషయం తెలిసిందే. ఫణి బారిన పడి తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఏడాది వేతనాన్ని సీఎం సహాయక నిధికి విరాళంగా ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయంతో సుమారు రూ.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందనున్నాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా సీఎం తీసుకున్న నిర్ణయంపై ఒడిశా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనసెరిగిన నేత అని ప్రశంసలు కురిపిస్తున్నారు. తుఫాను ధాటికి నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. పునరావాస, తదితర చర్యల నిమిత్తం సీఎం సహాయ నిధికి విరాళాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒడిశా ముఖ్యమంత్రికి ప్రస్తుతం నెల వేతనంగా రూ.1,60,000 ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఈ మొత్తం రూ.19,20,000 అవుతుంది. ఈ మొత్తాన్ని సీఎం నవీన్ పట్నాయక్.. తుఫాన్ బాధితుల కోసం విరాళంగా ప్రకటించారు. ఒడిశాపై విరుచుకుపడిన ప్రచండ తుఫాన్ ఫణి.. ఆ రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా ఒడిశాలో 34 మంది మరణించారు. ఒక్క పూరీ పట్టణంలోనే 21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ భయానక తుఫాన్‌కు ఒడిశా తీర ప్రాంతాలు భీతావహంగా మారాయి. తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. పైగా వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రచండ గాలులు పెను బీభత్సం చేశాయి.బలమైన గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెల్‌ఫోన్‌ టవర్లు, భారీ క్రేన్లు, వాహనాలు నెలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కిటికీలు, డోర్ల అద్దాలు విరిగిపడ్డాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస తదితర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం చేసింది. 

Related Posts