YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీనే పెద్ద పార్టీ

బీజేపీనే పెద్ద పార్టీ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల తో కలిసి బీజేపీకి 150 స్ధానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు.యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. 2014లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీకి 73 స్ధానాలు దక్కడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. యూపీలో ఈసారి బీజేపీకి 13 నుంచి 17 స్ధానాలు మాత్రమే లభిస్తాయని, ఎస్పీ-బీఎస్పీకి 55 స్ధానాలు వస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు.ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. మమతా బెనర్జీ మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్ధానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు సైగం 125-130 స్ధానాలు లభిస్తాయని, ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్ధానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు
మోడీదే అధికారం : రాందాస్
 గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. ఎస్సీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమితో యూపీలో బీజేపీకి 10 నుంచి 15 సీట్లు తగ్గుతాయని మహారాష్ట్ర దళిత నేత అంచనా వేశారు. 2014లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి యూపీలోని 80 స్ధానాల్లో 73 స్ధానాలను గెలుచుకుందని, అయితే ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ వేర్వేరుగా పోటీచేశాయని గుర్తుచేశారు.2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆ మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీకి దక్కే స్ధానాలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సైతం 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 5-6 సీట్లు తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గే స్ధానాలను బీజేపీ పశ్చిమ బెంగాల్‌, ఒడిసా రాష్ట్రాల్లో భర్తీ చేస్తుందని, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా లోక్‌సభ స్ధానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విస్పష్ట మెజారిటీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  

Related Posts