YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేది లేదు: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేది లేదు: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్లలోని అన్ని స్లిప్ లనూ లెక్కించి, ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిచూడాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని
వెలువరించింది. వీవీప్యాట్ లెక్కింపుపై గతంలో తామిచ్చిన ఆదేశాలే అమలవుతాయని, 100 శాతం స్లిప్ లను లెక్కించాలన్న పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. 'టెక్నోపర్‌ ఆప్‌' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం, ఈ పిటిషన్ లో ఎలాంటి మెరిట్‌ లేదని అభిప్రాయపడింది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇది అనవసర పిటిషన్‌ అని, దీన్ని మేం విచారించబోమని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది
చెన్నైకు చెందిన టెక్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించింది. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ తీసుకొచ్చారు. సీజేఐ తీర్పును మేం అధిగమించలేం. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో మేం జోక్యం చేసుకోలేం. ఇలాంటి అర్థం లేని పిటిషన్‌ను మేం విచారించబోం. దీన్ని కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసం వెల్లడించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకునే వీవీప్యాట్‌ల సంఖ్యను కనీసం 50శాతానికి పెంచాలంటూ ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌లను లెక్కిస్తే సరిపోతుందంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదిలావుండగా, ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నేతలు నేడు ఈసీని కలవనున్న సంగతి తెలిసిందే. తొలుత వీవీప్యాట్ లను లెక్కించి, ఆ తరువాత ఈవీఎంలను లెక్కించాలన్నది వీరి డిమాండ్ కాగా, తొలుత లెక్కించే వీవీప్యాట్ స్లిప్ లలో తేడాలు వస్తే, మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని 21 పార్టీలూ కోరనున్నాయి.

Related Posts