YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి యువతులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి యువతులు దుర్మరణం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్.. పక్క నుంచి వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బస్సు కిందికి దూసుకుపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. రాజమండ్రికి చెందిన పావని (21), నాగలక్ష్మి (21) అనే ఇద్దరు యువతులతో పాటు శివ (22) అనే యువకుడు రాజమహేంద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నుంచి ఇటీవలే బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన వీరికి 25 రోజుల కిందట.. చెన్నైలో ఉద్యోగావకాశం రావడంతో ముగ్గురూ కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడి ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు.రోజూ మాదిరిగానే మంగళవారం (జులై 16) ఉదయం కార్యాలయానికి చేరుకునే నిమిత్తం ముగ్గురూ కలిసి ఒకే బైక్ మీద బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. బస్సు, మరో బైక్ మధ్యన ఉన్న కాస్త చోటు నుంచి శివ తన బైక్‌ను ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. పావని తండ్రి అనారోగ్యంతో రెండు నెలల కిందటే మృతి చెందారు. ముగ్గురి కుటుంబాల పరిస్థితి అంతంతమాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. యువతులను చెన్నైకి పంపించడానికి వారి కుటుంబసభ్యులు అనాసక్తి కనబరచగా.. తెలిసినవారు నచ్చజెప్పడంతో పంపించినట్లు తెలుస్తోంది. వాళ్లు ఇకలేరనే విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నాగలక్ష్మి, పావని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన శివ రాయపేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Related Posts