YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంక... పంతం నెగ్గించుకున్నారు...

 ప్రియాంక... పంతం నెగ్గించుకున్నారు...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్ జిల్లా సోన్‌భద్రలోని ఘోరావల్‌లో ఓ స్థలవివాదంపై బుధవారం చోటుచేసుకున్న గొడవలో పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామపెద్ద యగ్యాదత్‌ వర్గం, స్థానిక గిరిజనుల మధ్య వివాదం తలెత్తడంతో దత్‌ అనుచరులు కాల్పులు జరపగా పది మంది ఆదివాసీలు మృతిచెందారు. బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకుని గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి వెళ్లిపోవచ్చంటూ జిల్లా కలెక్టరు సూచించినా ప్రియాంక మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. శుక్రవారం రాత్రి అక్కడే ఆమె బసచేశారు. దీంతో ప్రియాంక పట్టుదలకు అధికారులు దిగరాకతప్పలేదు. శనివారం ఉదయం మరోసారి ప్రియాంకను కలిసిన అధికారులు బాధితులను కలవాలనే నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమె మాత్రం ససేమిరా అన్నారు. వారిని కలవకుండా ఇక్కడ నుంచి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఒకవేళ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అనుమతించకపోతే వారిని కలవడానికి అనువైన ప్రదేశాన్ని అధికారులు సూచిస్తే తాను కలుస్తానని ప్రియాంక గాంధీ ఉద్ఘాటించారు. ప్రియాంక ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులు బాధిత కుటుంబాలకు చెందిన 15 మందిని గెస్ట్‌హౌస్‌కు తీసుకొచ్చారు. అయితే, వీరిని కలవడానికి కూడా అనుమతించకపోవడంతో విషయం తెలుసుకున్న ప్రియాంక మరోసారి ధర్నాకు దిగారు. వారిని కలవడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అధికారులు చివరకు వారిని ప్రియాంక వద్దకు పంపారు. ఈ సమయంలో ప్రియాంకను చూడగానే బాధిత కుటుంబాలు బోరున విలపించారు. ప్రియాంక సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయని కాంగ్రెస్ నేత వివేకానంద్ పాఠక్ తెలిపారు. మరోవైపు, బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన డేరక్ ఒబెరాయ్ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బృందాన్ని వారణాసి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలను పరామర్శించడం తప్పా? ప్రియాంకను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కాగా, సోన్‌భద్ర కాల్పులకు సంబంధించి గ్రామపెద్ద సహా 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. బాధితులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామన్నారు.

Related Posts