యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని ఇవాళ ప్రతిపక్షాలు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని అధిర్ డిమాండ్ చేశారు. అయితే జీరో అవర్లో దీని గురించి చర్చిద్దామని స్పీకర్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ దీనిపై ప్రకటన చేస్తుందని పార్లమెంటరీ వ్యవహారల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వరకు తీసుకు వెళ్లింది ఎవరో తెలుసు అని ఆయన పరోక్షంగా మాజీ ప్రధాని నెహ్రూపై ఆరోపణలు చేశారు. ఇది సీరియస్ అంశమని, ఇందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ట్రంప్ కామెంట్పై చర్చ చేపట్టాలని సీపీఐ ఎంపీ డీ రాజా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. మాజీ విదేశాంగ మంత్రి ఎస్ థరూర్ కూడా స్పందించారు. తానేమీ మాట్లాడుతున్నాడో ట్రంప్కు తెలియదని, బహుశా ఆయనకి సమస్య అర్థం కాలేదనుకుంటే, లేదా ఆయనకు సరిగా ఎవరూ చెప్పలేదనుకుంటనన్నారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తి వద్దు అన్న విషయం మన విధానం అని, మధ్యవర్తి కోసం మోదీ మరొకర్ని ఆశ్రయించడం అసంభవమే అన్నారు. ఒకవేళ పాక్తో మాట్లాడాలని అనుకుంటే, నేరుగా మాట్లాడాలని శశిథరూర్ అన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ పార్లమెంట్లో సమాధానం ఇవ్వాలని ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ట్రంప్ కశ్మీర్పై మాట్లాడడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కశ్మీర్ సమస్యపై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరడం అంటే.. ఇది ఇండియా ఐక్యశక్తికి పెద్ద విఘాతమే అని తివారీ అన్నారు. మోదీనే ఆహ్వానం కోరినట్లు ట్రంప్ తెలపారని తివారీ గుర్తు చేశారు. ప్రధాని మోదీ సభకు వచ్చి.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ నిజంగానే ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగని పక్షంలో.. కశ్మీర్పై అమెరికా తప్పుడు ప్రకటనలు చేస్తుందని ప్రధాని చెప్పాలన్నారు. ఇదే డిమాండ్పై ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
అదేమి లేదు : జై శంకర్
కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్ను మోదీ కోరలేదని ఇవాళ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. పాక్తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షికంగానే చర్చిస్తామని మంత్రి తెలిపారు. సీమాతంర ఉగ్రవాదం నిలిపివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ప్రకారమే పరిష్కారం అవుతాయన్నారు. అయితే సభ్యుల నినాదాల మధ్య సభను 12 గంటలకు వాయిదా వేశారు. కశ్మీర్ సమస్య జాతీయ అంశమని, జాతి ఐక్యతకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
ప్రధానే చెప్పాలి : రాహుల్
కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలంటూ ట్రంప్ను మోదీ కోరినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్తో కశ్మీర్ సమస్యపై మోదీ ఏం మాట్లాడారో .. ఆ విషయాన్ని ఆయన వెల్లడించాలని రాహుల్ తన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. భారత్, పాక్ మధ్య ఉన్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలని మోదీనే కోరినట్లు ట్రంప్ తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు ఇవాళ పార్లమెంట్లో ఆందోళన కూడా చేపట్టాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. భారత విశ్వాసాలను మోదీ దెబ్బతీశారని రాహుల్ అన్నారు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు. ప్రధాని అలా మాట్లాడలేదని విదేశాంగ శాఖ అంటే సరిపోదు అని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోదీ మధ్య కశ్మీర్ గురించి జరిగిన చర్చ వివరాలను వెల్లడించాల్సిందే అని రాహుల్ అన్నారు.
లాడెన్ వివరాలు మేమే చెప్పాం : ఇమ్రాన్
ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఇచ్చిన సమాచారమే.. ఆల్ఖయిదా చీఫ్, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను గుర్తించడంలో సీఐఏకు ఉపయోగపడిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 2011లో ఉగ్రవాది లాడెన్ను అమెరికా సీల్ పోలీసులు హతమార్చారు. అయితే అప్పటి వరకు లాడెన్ గురించి తెలియదని పాక్ పదేపదే చెబుతూ వచ్చినా.. తాజాగా అమెరికా ట్రిప్లో ఉన్న ఇమ్రాన్.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న అబోటాబాద్లో నేవీ సీల్ పోలీసులు లాడెన్ను అంతం చేశారు. అయితే పాక్కు చెందిన ఐఎస్ఐ ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారమే లాడెన్కు గుర్తించడంలో సీఐఏ సులువైందని ఖాన్ అన్నారు. ఫోన్ సంభాషణ ద్వారా లాడెన్ దాచుకున్న వివరాలను వెల్లడించినట్లు ఆయన చెప్పారు.