YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రంప్‌ వ్యాఖ్యలతో మరోసారి దద్దరిల్లిన లోక్‌సభ కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

ట్రంప్‌ వ్యాఖ్యలతో మరోసారి దద్దరిల్లిన లోక్‌సభ    కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

 కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ మరోసారి దద్దరిల్లింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ మౌనంగా ఉండటం సరికాదని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. మోదీనే నేరుగా మాట్లాడాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ వివాదంపై స్పందించారు.  కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదని, మోదీ-ట్రంప్‌ భేటీలో ఆ విషయం చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘భారత ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కశ్మీర్‌ విషయంలో విదేశాంగమంత్రి జయ్‌శంకర్‌ చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే ఒసాకాలో మోదీ-ట్రంప్‌ భేటీ జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నారు. కశ్మీర్‌ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. అంతేగాక మధ్యవర్తిత్వం అనేది శిమ్లా ఒప్పందానికి విరుద్ధం’ అని రాజ్‌నాథ్ తెలిపారు.  అనంతరం కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.ట్రంప్‌... పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి సోమవారం వాషింగ్టన్‌లో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ నన్ను కలిశారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అడిగారు. ఉభయ దేశాలు కోరితే నేను అందుకు సిద్ధం. నేను ఏదైనా సాయం చేయగలనంటే చేస్తాను’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే విపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తాయి. మధ్యవర్తిత్వం వహించాలని మోదీ కోరినట్టు ట్రంప్‌ చెప్పినందున దీనికి ప్రధానే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. దీంతో  ‘‘మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్‌ను మోదీ అసలు అడగనే లేదు. కశ్మీర్‌ విషయంలో మూడో పక్షం జోక్యానికి తావులేదు’’ అని కేంద్రమంత్రి జయ్‌శంకర్‌ స్పష్టం చేశారు. అయినా సంతృప్తి చెందని విపక్షాలు నేడు మరోసారి నిరసనకు దిగాయి. మోదీయే స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Related Posts