YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

49 మందికి 62 మంది కౌంటర్

49 మందికి 62 మంది కౌంటర్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశంలోని మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని కోరుతూ 49 మంది ప్రముఖులు జులై 23న బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. అయితే ఈ లేఖకు రాసిన రెండు రోజులకే దీనికి కౌంటర్‌గా అన్నట్టు వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాయడం విశేషం. మూకదాడులపై కొంతమంది ప్రధానికి లేఖ రాయడంపట్ల తాము ఆశ్చర్యానికి గురయ్యామని అందులో పేర్కొన్నారు. మావోయిస్టుల దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కశ్మీర్‌లో తీవ్రవాదులు పాఠశాలను తగలబెట్టినప్పుడు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు వీళ్లెందుకు మౌనంగా ఉన్నారని ప్రముఖులు తమ లేఖలో ప్రశ్నించారు. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గీత రచయిత, సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ ఛైర్మన్ ప్రసూన్ జోషి, శాస్త్రీయ నృత్యకళాకారిణి, ఎంపీ సోనల్ మాన్‌సింగ్, దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఈ లేఖలో సంతకాలు చేసినవారిలో ఉన్నారు.
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ప్రజలను కొంతమంది ప్రముఖులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. మోదీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘భారీ మార్పులో మనం భాగస్వాములం. అభివృద్ధి దిశగా మార్పులు చోటుచేసుకుంటుంటే కొందరు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు తమ నేతలను ఎంపిక చేసుకున్నారు. ప్రజాతీర్పును గౌరవించలేని వాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడగలరా’ అని కంగనా మండిపడ్డారు. ఆ 49 మంది తామే దేశంలోని ప్రజాస్వామ్య విలువలను రక్షించేవారిగా చెప్పుకోవడం చూస్తుంటే దీని వెనుక రాజకీయ ప్రేరేపిత దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. ఇలాంటి లేఖలతో దేశంలోని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయంగా భారతదేశం ఖ్యాతిని దెబ్బతీసేందుకు, జాతీయవాదం, మానవతావాదాన్ని నెలకొల్పడానికి ప్రధానమంత్రి మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ లేఖ రాసినట్టుందని విమర్శించారు. జులై 23 న మోదీకి రాసిన లేఖలో సంతకాలు చేసిన వారిలో సినీ దిగ్గజాలు ఆదూర్ గోపాలకృష్ణన్, మణిరత్నం, అపర్ణాసేన్, చరిత్రకారుడు రామచంద్ర గుహతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నారు. జైశ్రీరామ్ అన్నది యుద్ధ నినాదంగా మారిపోయిందని, మతం పేరుతో దాడులు జరగడం.. శాంతికాముక భారత పౌరులుగా గర్వించే తాము ఆందోళన చెందుతున్నట్టు లేఖలో తెలిపారు.

Related Posts