YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎట్టకేలకు సానా సతీష్ అరెస్ట్

 ఎట్టకేలకు సానా  సతీష్ అరెస్ట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీల్యాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రమికవేత్త సానా సతీష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. మొయిన్‌ ఖురేషీని కేసు నుంచి బయట పడేందుకు సానా సతీశ్‌ ఏకంగా సీబీఐ డైరెక్టర్‌కే ముడుపులు చెల్లించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై సతీశ్ అవినీతి ఆరోపణలు చేసి సీబీఐ అధికారుల మధ్య వివాదానికి కారణమయ్యారు. రస్మా ఎస్టేట్స్, ఎల్ఎల్‌పీ, గోల్డ్‌కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలకు సానా సతీష్ డైరెక్టర్‌గా ఉన్నారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేసిన రాకేష్ ఆస్థానా తనను రూ.2 కోట్లు లంచం అడిగారని సతీశ్ ఆరోపించడం విశేషం. సతీష్ బాబును ఢిల్లీ ఈడీ కోర్టులో అధికారులు శనివారం హాజరు పరచనున్నారు. గతేడాది సీబీఐ అంతర్గత పోరు వ్యవహారంలో హైదరాబాద్ వ్యాపారి సాన సతీశ్ బాబు కీలకంగా వ్యవహరించారు. ఆయన ఫిర్యాదుతోనే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదైంది. కాకినాడకు చెందిన సతీష్.. కొంత కాలంపాటు విద్యుత్ శాఖలో పని చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటంతో.. వ్యాపారం కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. గోదావరి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, టీడీపీ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ గ్రూప్‌ కంపెనీల్లోనూ తొలినాళ్లలో సతీశ్ బాబు డైరెక్టర్‌గా పని చేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు 24 కంపెనీల్లో ఆయన డైరెక్టర్‌గా పని చేశారు. ఇక, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులే కాదు.. ఆఖరికి సీబీఐ వారికి కూడా డబ్బు ఎరవేసి వారిని లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు మెయిన్ ఖురేషీ. ఇతగాడి పేరు 2014లో వెలుగులోకి వచ్చింది. నాటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటికి 15 నెలల కాలంలో ఖురేషీ 70 సార్లు వెళ్లి ఆయన్ను చిక్కుల్లో పడేశాడు. ఆ తరువాత మరో సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టు 2014లో వెల్లడైంది. ఏపీ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ఐటీ, ఈడీ దర్యాప్తు చేశాయి. దీనిపై సీబీఐ గత ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీంతో యూపీఎస్సీలో సభ్యునిగా ఉన్న సింగ్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. హవాలా కేసులో ఖురేషీ, వ్యాపారి సానా సతీశ్‌లు అలోక్‌వర్మకు రూ.2 కోట్లు లంచం ఇచ్చారని సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా ఆరోపించారు. కానీ సానా సతీశ్ నుంచి ఆస్థానానే రూ.3 కోట్లు లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ అలోక్‌వర్మ ఆయనపై ఏకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరి పరస్పర ఆరోపణలతో అలోక్‌వర్మ, ఆస్థానాలను బాధ్యతల నుంచి తొలిగించింది మోడీ సర్కార్‌. ఈ కేసుతో సీబీఐ ప్రతిష్ఠ మొత్తం బజారుకెక్కింది. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోయగా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ పనితీరుపై ప్రజల్లో మరింత సందేహాలు వ్యక్తమయ్యాయి.

Related Posts