YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రాణహాని ఉందని సుప్రీంకోర్టుకు రేప్ బాధితురాలు లేఖ.. సీజేఐ తీవ్ర ఆగ్రహం!

ప్రాణహాని ఉందని సుప్రీంకోర్టుకు రేప్ బాధితురాలు లేఖ.. సీజేఐ తీవ్ర ఆగ్రహం!

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశ్యవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార బాధితురాలు జులై 12న సుప్రీంకోర్టుకు లేఖ రాయగా, ఆ విషయంపై మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రావడం విశేషం. కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లారని ఉన్నావో బాధితురాలు తనకు ప్రమాదం జరగడానికి ముందే ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కు ఒక లేఖ రాశారు. లేఖ రాసినా చీఫ్ జస్టిస్కు చేరకముందే గత ఆదివారం ఆమె ప్రమాదానికి గురయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి తన లేఖలో అభ్యర్థించింది. మరికొందరు వచ్చి కేసు వెనక్కు తీసుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని ఈ లేఖలో ఆమె తెలిపారు. అలాగే తప్పుడు కేసులు బనాయించి జైలులో పెడతామని భయపెడుతున్నారని ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో బాధితురాలు వాపోయింది.
తనపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ మనుషులే ఈ పనిచేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అయితే, ఉన్నావో అత్యాచార బాధితురాలి తనకు రాసిన లేఖ చేరడంలో జాప్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధితురాలు రాసిన లేఖ గురించి మీడియాలో ప్రచారం అయిన తర్వాతే తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ఇది మంగళవారమే తన దృష్టికి వచ్చిందని, ఇంత వరకు దానిని తానను చదవలేదని తెలిపారు. ఈ విషయం గురించి కోర్టు రిజిస్ట్రీని వివరణ కోరినట్లు వెల్లడించారు. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే బాధితులు నేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించే స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని జస్టిస్ గొగొయ్ అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఉన్నావ్ బాధితురాలి లేఖపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి లేఖపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేయడంతో చిన్నారులపై అత్యాచార కేసులను పర్యవేక్షిస్తున్న న్యాయవాది వి. గిరి, ఉన్నావో అత్యాచార కేసును అత్యవసర ప్రాధాన్యత జాబితాలో చేర్చాలని సూచించారు. అలాగే, ఉన్నావో బాధితురాలి ప్రమాదం కేసుపై తక్షణమే నివేదిక సమర్పించాలని యూపీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉన్నావో అత్యాచార బాధిత యువతి ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ముందే సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాయడం గమనార్హం.
బాధిత యువతి, ఆమె బంధువులైన ఇద్దరు మహిళలు, వారి తరఫున లాయర్ కలిసి రాయబరేలీకి కారులో వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు యువతికి సమీప బంధువు, అత్యాచార కేసులో కీలక సాక్షి. ప్రమాదంలో బాధిత యువతి సహా న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువతి, లాయర్ కోలుకుంటున్నారు. వారికి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు వెల్లడించారు. రాయ్బరేలీ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న యువతి బంధువును కలిసేందుకు వెళ్తుండగా లక్నోకు 45 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది ప్రమాదం కాదని, తమను హత్యచేయడానికే పక్కా ప్రణాళికతో కుట్రపన్నారని పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ సోదరుడు మనోజ్ సింగ్, కున్ను మిశ్రా, మరో నిందితుడు శశి సింగ్ తనయుడు నవీన్ సింగ్ సహా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు జూలై 7న తమ ఇంటికి వచ్చి బెదిరించారని బాధితులు తమ లేఖలో పేర్కొన్నారు. జడ్జిలను మేనేజ్చేసి కుల్దీప్ సింగ్, శశి సింగ్లను బెయిల్పై బయటకు తీసుకొస్తామని, నిన్ను, మీ బంధువుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతామని బాధిత యువతిని బెదిరించినట్టు సమాచారం. సుప్రీంకోర్టుకు జులై 12న బాధిత యువతి రాసిన లేఖపై ముగ్గురు మహిళలు సంతకాలు చేశారు. వీరిలో ఒకరు బాధిత యువతి బంధువు పుష్పా సింగ్ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అత్యాచారం కేసులో ఆమె కీలకమైన సాక్షిగా ఉన్నారు.
కాగా, బాధితురాలికి యూపీ ప్రభుత్వం భద్రత కొనసాగిస్తున్నట్టు డీజీపీ ఓపీ రావత్ వెల్లడించారు. అయితే, రాయబరేలీకి వెళ్తున్నప్పుడు భద్రతా సిబ్బందికి చోటు సరిపడకపోవడం వల్లే వారు తన వెంట రాలేదని ఆ యువతే స్వయంగా చెప్పిందని ఆయన అన్నారు. భద్రత కోసం 10 మంది పోలీసులకు కేటాయించామని, వీరిలో ముగ్గురు ఆమె వ్యక్తిగత భద్రతకు, ఏడుగురు ఇంటి వద్ద సెక్యూరిటీకి వినియోగిస్తున్నామన్నారు.

Related Posts