YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీకీ సుప్రీంకోర్టు భారీ షాక్

యూపీకీ సుప్రీంకోర్టు భారీ షాక్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం భారీ షాక్ ఇచ్చింది. ఉన్నావో అత్యాచార ఘటన కేసును కోర్టు ప్రారంభమైన వెంటనే సుప్రీం విచారణ చేపట్టింది. ఉన్నావో అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులన్నీ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీచేయాలని సూచించింది. అంతేకాదు, ఉన్నావో అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాద కేసులో తమకు పూర్తి వివరాలను అందజేయాలని సీబీఐని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న అధికారికి ఫోన్ చేసి రప్పించి, తమకు మధ్యాహ్నం 12 గంటల్లోగా వివరాలను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ గొగొయ్ సూచించారు. కోర్టు సూచనతో సీబీఐ డైరెక్టర్‌కు ఫోన్‌చేసి మాట్లాడిన సొలిసిటర్ జనరల్.. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు లక్నోలో ఉన్నారని, 12 గంటల్లోగా రావడానికి వీలుపడదని ధర్మాసానికి తెలిపారు. రేపటి వరకూ ఈ కేసు విచారణ వాయిదా వేయాలని సీబీఐ డైరెక్టర్ అభ్యర్థించినట్టు తెలియజేశారు. అయితే, ఈ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాదు, కేసును పర్యవేక్షిస్తున్న అధికారికి ఫోన్‌చేసి సంక్షిప్తంగా వివరాలను తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటల్లోగా తెలియజేయాలని, పూర్తి వివరాలను విచారణ పూర్తయిన తర్వాత తెలియజేయాలని హుకుం జారీచేశారు. అనంతరం కేసు విచారణ 12 గంటలకు వాయిదా వేసింది. వాయిదా అనంతరం తిరిగి 12 గంటలకు విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మొత్తం కేసులను ఢిల్లీకి బదిలీచేయాలని సీబీఐకి సూచించింది. దీనిపై స్పందించిన సీబీఐ ఇవి బదిలీచేయడానికి 30 రోజులు పడుతుందని అంటే, అలా కుదరదని వారం రోజుల్లో ప్రకియ పూర్తిచేయాలని ఆదేశించింది. అలాగే, ప్రమాదంలో గాయపడిన బాధితురాలు, ఆమె తరఫు లాయర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బృందాన్ని నియమించిన సర్వోన్నత న్యాయస్థానం, మధ్యాహ్నం 2 గంటల్లోగా సమాచారం తెలియజేయాలని, మెరుగైన వైద్యం కోసం ఎయిర్‌ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని పేర్కొంది. బాధితురాలు, ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సందర్భంగా పరిహారాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టబద్ధంగా నిర్ణయించాలని ఓ లాయర్ జోక్యం చేసుకోగా జస్టిస్ గొగొయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఈ దేశంలో ఏం జరుగుతోంది? పరిహారం మంజూరు చేయకపోతే మేము విధి నిర్వహణలో విఫలమవుతాం.. మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనంతరం సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్‌కు ధర్మాసనం తలంటింది. బాధితురాలు రాసిన లేఖను వీలైనంత తొందరగా ఎందుకు తమముందు ఉంచలేదని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన సెక్రెటరీ జనరల్.. తమకు మొత్తం 1,100పైగా లేఖలు వచ్చాయని, ఉన్నావో బాధితురాలు లేఖను న్యాయస్థానం సూచనలతో ముందుంచడానికి ప్రయత్నించామని అన్నారు. మరోవైపు, నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌ను పార్టీ నుంచి బీజేపీ బహష్కరించింది. అలాగే, బాధిత యువతి భద్రతకు నియమించిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సహా ముగ్గురు పోలీసుల్ని విధుల నుంచి తప్పించారు.

Related Posts