
వాన్పిక్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా పోలీసులు గతవారం అదుపులోకి తీసుకున్నారు. నిమ్మగడ్డ విడుదలైనట్టు సమాచారం. అయితే, ఆ దేశ రాజధాని బెల్గ్రేడ్ విడిచి వెళ్లరాదనే షరతులతో ఆయనను విడుదల చేశారని తెలుస్తోంది. నిమ్మగడ్డ బెయిల్పై బయటకొచ్చారా? విదేశాంగ శాఖ చొరవ తీసుకుందా? అనేది తెలియాల్సి ఉంది. వాన్పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో పెట్టుబడులు పెట్టిన తమకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్ క్రిమినల్ కోడ్ కింద నిమ్మగడ్డ ప్రసాద్పై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన నిమ్మగడ్డను తమకు అప్పగించాలన్న రస్ ఆల్ ఖైమా(రాక్) అభ్యర్థన మేరకు 2016 సెప్టెంబరు 5న ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అయితే, ఈ నోటీసు జారీచేసిన తర్వాత బ్రిటన్, సింగపూర్తో సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ పర్యటించినా పట్టించుకోలేదు. తాజాగా, ఆయన సెర్బియా పర్యటనకు వెళ్లినపుడు అక్కడి పోలీసులు జులై 27న అదుపులోకి తీసుకుని, బెల్గ్రేడ్లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన నిర్బంధాన్ని అనుమతించిన కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్బంధం జులై 27 ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుందని, దీనిని గరిష్ఠంగా ఏడాది వరకు కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్కార్నర్ నోటీసు, తమకు అప్పగించాలన్న రాక్ అభ్యర్థన తమ వద్ద ఉందని వెల్లడించింది. సెర్బియాలో నిందితుడికి నివాసం లేదని, రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడి వాదనలు వినకుండా తక్షణమే అరెస్ట్ చేయడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిమ్మగడ్డను షరతులతో విడుదల చేసినట్టు సమాచారం. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన అక్కడి చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా బెల్గ్రేడ్ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు. వాన్పిక్ వ్యవహారంపై సీబీఐ నమోదుచేసిన కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ఏ3గా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఆయనకు సీబీఐ కోర్టు షరతులతో కూడి బెయిలు మంజూరు చేసింది. 2018 జనవరి 8 నుంచి రెండేళ్లపాటు విదేశాలకు వెళ్లడానికి ఇదే కోర్టు అనుమతించింది. తాజాగా సెర్బియా వెళ్లి ఆయన ఇరుక్కున్నారు.