YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇంతింతై..వటుడింతై... ఎదురు లేని మోడీ

ఇంతింతై..వటుడింతై...  ఎదురు లేని మోడీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఒక వైపు రాజకీయాలు.. మరోవైపు సంచలన నిర్ణయాలు. గత కొన్నేళ్లుగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయినా మరికొన్నింటిని ప్రజలు ఆదరించారు. అందుకే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారు. తాజాగా కాశ్మీర్ విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగానే కాదు సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు సయితం మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రధానిగా మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీ సీనియర్ నేతలను పట్టించుకోలేదన్న విమర్శలు విన్పించాయి. ముఖ్యంగా ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలను గత ప్రభుత్వ హాయాంలో పక్కన పెట్టారు. ఇటీవల జరిగన ఎన్నికల్లో అద్వానీ, మురళీమనోహర్ జోషి, సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్ వంటి నేతలకు టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. దీంతో బయట ఎలా ఉన్నా పార్టీలో వీరిద్దరూ విమర్శలు ఎదుర్కొన్నారు.నోట్ల రద్దు సమయంలో మోదీ సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక మంది బీజేపీ నేతలు మోదీ నిర్ణయంపై పెదవి విరిచారు. ఇక మిత్రపక్షమైన శివసేన అయితే నోట్ల రద్దు నిర్ణయంపై మోదీపై చిందులు తొక్కింది. అయితే ఇవన్నీ మోదీ పటాపంచలు చేసేశారు. కాశ్మీర్ విషయంలో సొంత పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్, శివసేనలు మోదీని ఆకాశానికెత్తుతున్నాయి. సాహసోపేత నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్, వీహెచ్ పి లు కాశ్మీర్ సమస్యకు ఒక్కరోజులోనే మోదీ పరిష్కరించారని ప్రశంసించాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ , బాల్ థాకరే కల నెరవేర్చిందని, మోదీ గ్రేట్ అంటూ శివసేన పొగడ్తలతో ముంచెత్తింది. ఇక సీనియర్ నేత అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు సయితం మోదీని ఆకాశానికెత్తారు. జన్ సంఘ్ నుంచి తమ నినాదం అదేనని అద్వానీ వ్యాఖ్యానించడం విశేషం. బీజేపీ సిద్ధాంతాలను అమలు చేస్తున్న మోదీకి ఇక సంఘ్ పరివార్ లోనూ, పార్టీలోనూ ఎదురు లేదనే చెప్పాలి.

Related Posts