YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కాణిపాకం వినాయకుడు

కాణిపాకం వినాయకుడు

యువ న్యూస్ కల్చరల్ బ్యూరో:

పంచభూతాలలో మట్టి విశిష్టమైనది. ఏ వస్తువైనా, మట్టినుంచే పొందాలి. మట్టిపైనే నివసించాలి. మట్టిపై నుంచి వచ్చే నీటినే తాగాలి, గాలినే పీల్చాలి. కాని శ్రమించి మట్టినుండే దేవతల అనుగ్రహము పొందాలి. వినాయకుడిని తమ ఇలవేల్పుగా భావించే ఓ అన్నదమ్ములు వారి కష్టాలు తీరి వారి పంట పొలం నీటి ఎద్దడి లేకుండా బాగా పండాలనే ఉద్దేశంతో వారి పొలంలో ఉండే బావికి పూడిక తీద్దామనుకొన్నారు. ఆ వారి వూరు చిత్తూరు దగ్గర గల నేటి కాణిపాకం అనే గ్రామం. ధర్మవర్తనులైన ఈ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న బావికి పూడిక తీద్దామని సంకల్పించుకున్నారు. కాని వారు ముగ్గురూ కూడా అంగవికలురే. మూగ చెవిటి గుడ్డివారైన వారు ముగ్గురూ తమ అంగవైక్యల్యాన్ని పక్కన పెట్టి చేతనైనంత పని చేసి భగవంతుని ప్రార్ధిద్దాం.
మన కష్టాలు గట్టెక్కుతాయి అనుకొని బావి పూడిక పనులు చేపట్టారు. అలా వారు తవ్వుతుండగా వారి పలుగుకు రాయి తగిలింది. ఈ రాయిని తొలగిస్తే మంచి జల పుడ్తుందని ఆ గ్రామస్థులు అన్నారు. సోదరులు అతికష్టంతో ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశారు. అపుడు ఆ రాయికి తగిలిన పలుగు పారల దెబ్బల వల్ల బయటకు రక్తం చిమ్మింది. ఆ రక్తం ఈ అంగవికలురైన సోదరులమైన పడింది. వెంటనే వారి అంగవికలత్వం పోయింది. మామూలు మనుషులైపోయారు. కాని ఆ రాయినుంచి ఏకధారగా రక్తం కారసాగింది. వారు భయపడి ఇదంతా ఆ దేవుని మహిమ అని పదేపదే తమని మన్నించమని నమస్కరించారు.
ఆ దేవదేవునికి కొబ్బరికాయలు కొట్టారు. విషయం తెలుసుకొన్న గ్రామస్థులు కూడా కొబ్బరికాయలను దేవునకు సమర్పించారు. ఈవిషయం తెలుసుకొని ఆ కాలంలో ఆ ఊరి జమిందారులు, రాజపరివారం వచ్చి పూర్తిగా బావిని తవ్వి చూడగా వారికి గణనాథుని రూపం దర్శనం ఇచ్చింది. ఆ గణనాథుని సర్వులు మొక్కులు మొక్కారు. సంతుష్టిచెందిన గణనాథుడు వారికి దర్శనం ఇచ్చి నాకు ఆలయాన్ని నిర్మించండి. నేను మిమ్ములందరినీ కాపాడుతాను అని వరం ఇచ్చాడట. ఇక అపుడు ఆ బావి ఉన్న స్థలంలోనే గణనాథునికి ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఇప్పటి కాణిపాకం వినాయకాలయం. ఆ సంగతి తెలుసుకొని చుట్టుపక్కల వారంతా వచ్చి గణనాథుని కొబ్బరికాయలను సమర్పించారట. అలా వారంతా సమర్పించిన కొబ్బరికాయల నీరు ఓ ఎకరం పారిందట. దాంతో అందరూ కాణి పారకరమ్ అని అన్నారట.
ఇక ఆ ఊరి పేరు కాణిపాకంగా కాలాంతరంలో రూఢయిపోయింది. ఇంతకుముందు కాలంలో ఈ క్షేత్రానే్న విహారపురి అని పిలిచేవారట. స్వయంభువుగా వెలిసిన నాటి నుంచి ఇప్పటిదాకా స్వామి దినదినాభివృద్ధిచెందుతున్నాడు. అప్పటికాలంలో చేయించి వెండి కవచాలు కూడ ఇప్పుడు పట్టనంతగా స్వామి పెరిగాడు. ఇలా ఆ గణనాథుడు పెరుగుతూ తన ఉనికిని బహిర్గతం చేస్తున్నాడని దూర తీరాలనుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రోత్సవంలోనే కాణిపాకం గణనాథునికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. స్వామి ఎదుట వ్యసనలోలురైన భక్తులు వచ్చి ఇకమీదట వ్యసనాల జోలికి వెళ్లమని ఒకసారి ప్రమాణం చేస్తేచాలట. వారు మళ్లీ ఆ వ్యసనాల దరికి వెళ్లరని ఇక్కడి స్థానికులు చెబుతారు. అంతేకాదు ఈ దేవుని ఎదుట సాక్ష్యం కోసం వాదిప్రతివాదులు వస్తుంటారు. సాక్షం చెప్పే వారు దేవుని ఎదురుగాచెప్పేవారు అబద్ధం సాక్ష్యం చెపితే వారికి దేవుడు కఠినమైన శిక్ష వేస్తాడట.
అందుకే ప్రమాణాల దేవునిగా కూడా కాణిపాక విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిచెందాడు. ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో స్వామికి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభోగంగా భక్తజనం జరిపిస్తారు.

Related Posts