Highlights
- ఉభయ సభలను ఉద్దేశించి
- గవర్నర్ నరసింహన్
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం సఫలమైందని గవర్నర్ నరసింహన్ అన్నారు. దేశంలో అత్యంత పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని చెప్పారు.సోమవారం తెలంగాణ శాసనసభ బిడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ...బంగారు తెలంగాణ సాధనకు ఈ అసెంబ్లీ సమావేశాలు దోహదపడుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. బంగారు తెలంగాణ సాధనకు పథకాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. మూడున్నరేళ్లలో అభివృద్ధివైపు దూసుకుపోతుంది. ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రగతి వైపు సాగుతున్నం. ఆర్ధికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టాం. 95శాతం మిషన్ భగీరథ పనులు పూర్తి అయినాయి. మిషన్ భగీరథపై దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాం. పలు రాష్ర్టాల అధికారులు వచ్చి మిషన్ భగీరథ పనుల గురించి తెలుసుకుంటున్నారు. విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించినం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ముందున్నాం. ప్రతి పల్లెకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టించామన్నారు.
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు పొందింది. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టింది. మేజర్, మీడియం నీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు మళ్లిస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటిప్రాజెక్టులను చేపట్టాం. మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్దరించుకున్నాం. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయి.వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టాం. 35.3 లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేసినం. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన చేసినం. త్వరలోనే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తం. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ అద్భుతంగా అమలవుతుంది. గొల్ల కురుమలకు 75శాతం సబ్సీడీతో గొర్రెలను అందిస్తున్నమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తున్నాం. ప్రతి ఏడాది ఆర్ధికాభివృద్ధిరేటు సాధిస్తున్నాం. ఉమ్మడి ఏపీలో జీఎస్డీపీ 4 శాతం మాత్రమే ఉండేది. ఇది జాతీయ సగటు కంటే 1.9 శాతం తక్కువ. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారింది. గడిచిన మూడేళ్లలో సరాసరి 8.6 శాతం చొప్పున జీఎస్డీపీ సాధిస్తున్నాం. జాతీయ సరాసరి సగటు 7.5 కంటే 1.1 శాతం అధికంగా జీఎస్డీపీ సాధించాం. 2016-17లో రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 54 వేలు. జాతీయ తలసరి ఆదాయం కేవలం లక్షా 3వేలు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ప్రభుత్వ ప్రణాళికతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. టీఎస్ఐపాస్తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఐటీ హబ్లతో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం. త్వరలోనే టీహబ్-2ను ప్రారంభిస్తున్నాం. బుద్వేల్లో ఐటీ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పీపీపీ పద్దతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించినం. పచ్చదనం పెంచేందుకు తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినం. కేసీఆర్ కిట్కు మంచి స్పందన లభిస్తుంది. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. నాణ్యమైన విద్యను అందించేందుకు 517 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు.