Highlights
- మండలి చైర్మన్ కంటి గాయం
- మైక్ విసిరిన కాంగ్రెస్ నేతలు
- సరోజినీ కంటి ఆస్పత్రికి వెళ్లి చికిత్స
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అపశృతి చోటుచేసుకుంది. గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్బంగా ఈ ఘటన నెలకొంది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ కు అంతరాయం కలిగించేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి పారవేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మైక్ విరిచి విసరగా అది గవర్నర్ పక్కనే ఉన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు కంటికి తగిలింది. దీంతో ఆయన బాధతో విలవిల్లాడారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన నేరుగా సరోజినీ కంటి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు.అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులు విసిరిన మైక్ నేరుగా తన కంటికి తగిలిందని తెలిపారు. బాధ కలుగుతున్నప్పటికీ ఓర్చుకుంటూ గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేవరకు ఓర్చుకున్నానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సూచన మేరకు సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో కాస్త జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరిరకైనా తమ నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. అయితే ఇలాంటి చర్యలు మాత్రం సరికాదని స్వామిగౌడ్ అన్నారు.