YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బోటు వెలికి తీత అంత ఈజీ కాదు

బోటు వెలికి తీత అంత ఈజీ కాదు

బోటు వెలికి తీత అంత ఈజీ కాదు
కాకినాడ, సెప్టెంబర్ 19
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగి పెనువిషాదానికి కారణమైన బోటు ఆచూకీ ఎట్టకేలకు గుర్తించిన విషయం తెలిసిందే. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వందలాది మంది నాలుగు రోజులపాటు తీవ్రంగా శ్రమించి బోటు 200 అడుగుల లోతులో ఉందని గుర్తించారు. ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ దళం తమ దగ్గరున్న అధునాతన సోనార్‌ వ్యవస్థ సాయంతో రెండు రోజులపాటు గాలించింది. మొత్తానికి కచ్చలైరు ప్రాంతంలో బోటు ఆచూకీ కనిపెట్టగలిగింది. అయితే, దీని ఆచూకీ తేల్చడం కంటే బయటకు తీయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు పేర్కొంటున్నారు.బోటును బయటకు తీసే సమయంలో ఎదురయ్యే ప్రతికూలతలను ఎలా అధిగమించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. గురువారం నుంచి బోటు వెలికితీత పనులు మొదలుపెట్టనున్నారు. బోటు దాదాపు 200 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించిన నిపుణులు దాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో నిపుణుడు, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందాన్ని రప్పించారు. నాలుగు అంగులాల మందం 600 అడుగుల పొడవైన నైలాన్‌ తాడు, 22 మి.మీ.మందం కలిగిన ఇనుప రోప్, సాధారణ రోప్‌లు, యాంకర్లు, డీ లింక్‌లు వంటి పరికరాలను ఈ బృందం తమ వెంట తీసుకొచ్చింది.ఈ తాళ్లకు యాంకర్లను కట్టి లోపలికి విడిచిపెడితే బోటు వాటికి తగులుతుందని, తర్వాత దాన్ని బయటకు లాగొచ్చని భావించారు. అయితే బోటు మునిగిపోయిన ప్రాంతం సుడిగుండాల మధ్య ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాన్ని బయటకు తీసేందుకు వెళ్తున్న బోట్లను కూడా అది లోపలికి లాగేసుకు ప్రయత్నిస్తుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీనిపై ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ఇంతటి మహా సుడిగుండాన్ని తానెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదన్నారు. ఇలాంటి ప్రదేశాన్ని తాను డిస్కవరీ ఛానెల్‌లోనే చూశానని సత్యం వ్యాఖ్యానించడం గమనార్హం.మరోవైపు, బోటును బయటకు తీయడానికి ముంబయి సాల్వేజ్‌ సంస్థకు చెందిన నిపుణుడు గౌరవ్‌ భక్షిని రప్పించారు. కాకినాడ పోర్టు అధికారి ధర్మశస్తాతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉందని, సుడిగుండాలు ఏర్పడుతుండటం వల్ల సహాయక బోట్లను ఎక్కువసేపు స్థిరంగా నిలిపి ఉంచలేమని వారు తేల్చారు. 200 అడుగులకు పైగా లోతులో ఉన్నందువల్ల దానిని బయటకు తీయడం ప్రస్తుతానికి దాదాపు అసాధ్యమని సహాయక బృందాలు చెబుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్ అధికారి డీఎన్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర జోషిలతో చర్చించిన తర్వాత.. బోటును వెలికితీయడానికి 1,000 మీటర్ల పొడవైన భారీ రోప్ అవసరమని నిర్ణయానికొచ్చారు. దానికి యాంకర్లు కట్టి బోటు మునిగిన ప్రదేశం చుట్టూ తిరుగుతూ ఆ తాడును నీటి లోపలికి వల మాదిరిగా వదిలితే దానికి తగిలే అవకాశముంటుందని, తర్వాత దాన్ని లాగుతూ ఒడ్డుకు తీసుకురావచ్చని నిపుణులు సూచించారు.కాగా, గోదావరిలో బోటు మునక ఘటనలో గురువారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద లభ్యమైన మృతదేహాన్ని హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌గా భావిస్తున్నారు. కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద మరో మృతదేహం ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు కచ్చులూరు బోటు మునక ఘటనలో బయల్పడిన మృతదేహాల సంఖ్య 36కి చేరింది.

Related Posts