తెలంగాణ శాసనసభలో గురువారం ప్రవేశపెట్టబోయే ఐదో వార్షిక బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవిధంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి అత్యధికప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. ఎప్పటిలాగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ దేశానికే ఒక నమూనాగా మారిందని చెప్పారు. మాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. దీనికి మేం 2014లోనే గట్టి పునాది వేసుకున్నాం. మొదటినుంచీ ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాగునీటిరంగాలకు ప్రాధాన్యమిస్తూ పక్కాగా బడ్జెట్ రూపొందించామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందుపరచని ఎన్నో పథకాలను, కార్యక్రమాలను బడ్జెట్లో ప్రవేశపెట్టాం. ప్రజల అవసరాలకు ప్రతిబింబంగా మా బడ్జెట్ ఉం టుంది. వ్యవసాయరంగానికి ఎక్కువ ప్రాధాన్యం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయం, అనుబంధరంగాలపై దృష్టి కేంద్రీకృతమవుతున్నది. సంక్షేమానికి ఎప్పటిలాగే పెద్ద పీట వేస్తామన్నారు.ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను ఆకర్షించడానికి ప్రత్యేక మార్పులు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. మా బడ్జెట్ ఈసారి కూడా పూర్తిగా ప్రజల అవసరాల ప్రాతిపదికనే ఉంటుందని చెప్పారు.
2017-18తో పోలిస్తే ఈసారి రెవెన్యూ రాబడులు పెరుగవచ్చు. వాస్తవ లెక్కల ఆధారంగా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ఎలా ఉంటుందనేది మరి కొద్దీ గంటల్లోనే తేలిపోనుంది.