పూణె టెస్ట్ ల్లో విరాట్ స్వరూపం డబుల్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ
ముంబై,
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. 295 బంతుల్లోనే 28 ఫోర్ల సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్లో విరాట్ కోహ్లీకి ఇది ఏడో డబుల్ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో ఏడో ద్విశతకం నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా అరుదైన ఘనత సాధించాడు. తొలి సెషన్లోనే 173 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ.. రెండో సెషన్లో సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ 190లోకి చేరుకున్నాడు. ఆ తర్వాత మూడో సెషన్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా 29 పరుగులతో ఉండగా.. భారత్ జట్టు 144 ఓవర్లు ముగిసే సమయానికి 483/4తో కొనసాగుతోంది.భారత్ తరఫున ఇప్పటి వరకూ టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాని పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ తాజాగా ఏడో ద్విశతకంతో నెం.1 స్థానానికి ఎగబాకాడు. ఇక కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఆరేసి డబుల్ సెంచరీలతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలవగా.. రాహుల్ ద్రవిడ్ ఐదు ద్విశతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నాలుగు డబుల్ సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు.