
నవంబర్ 3 నుంచి సిటీలో చెత్త వస్తువుల సేకరణ
హైద్రాబాద్,
మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా...ఉంటే వాటిని రోడ్లపైగాని, చెత్తకుప్పల్లో గాని, నాలాల్లో వేయకండి. మీ ఇంటికే జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాటిని సేకరిస్తారు. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిరుపయోగ వస్తువుల సేకరణకు బల్దియా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. నవంబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు పదిరోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, దిండ్లు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను ఈ ప్రత్యేక డ్రైవ్లో సేకరించాలని నిర్ణయించారు.ప్లాస్టికే ఏరివేత కార్యక్రమం స్పూర్తిగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నవంబర్ 3నుంచి ఇళ్లలోని వృథా వస్తువులను సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 10రోజుల పాటు కొనసాగే ఈ డ్రైవ్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేసన్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్.డబ్య్లూ.ఏలు, ఎన్.జి.ఓలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి నిరుపయోగ వస్తువులన్నింటిని జిహెచ్ఎంసికి అందజేయాలని విజ్జప్తి చేయనున్నారునిరుపయోగవస్తువుల సేకరణకు ప్రతి డివిజన్లో ఒక స్థలాన్ని ఎంపిక చేసి, సేకరించిన పనికిరాని వస్తువులను డంపింగ్ చేసేందుకు జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తోంది.పనికిరాని వస్తువులన్నింటిని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాలు, నాలాల్లో వేస్తున్నారు. అవి నీటి ప్రవాహానికి అడ్డుపడుతుండడంతో నాలాలు, మ్యాన్హోళ్లలోని మురుగు నీరు రోడ్లపై పారుతోంది. నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం కావడం నగరంలో సాధారణంగా మారింది. ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులవెంట ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్లాస్టిక్ డ్రైవ్ ద్వారా 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ను సేకరించింది. తద్వారా నాలాలు, డ్రెయిన్లు, మ్యాన్హోళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా పోయాయి.ఁ