దెయ్యాన్ని చూపించండి... 50 వేలు తీసుకోండి
భువనేశ్వర్,
మీరు దెయ్యాన్ని చూశారా? ఒక వేళ చూసి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తే రూ.50 వేలు నగదు బహుమతి గెలుచుకోవచ్చు. స్వయానా జిల్లా కలెక్టరే ఈ ప్రకటన చేశారు. దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలతో సహా వచ్చేవారికి ఆ బహుమతి ఇస్తామన్నారు.ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు రివార్డు ఇస్తాను. స్వయంగా నా జేబు నుంచే ఆ డబ్బులు చెల్లిస్తా’’ అని తెలిపారు.‘‘చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశాను’’ అని తెలిపారు. కలెక్టర్ చేసిన ప్రకటనపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించాలని కోరుతున్నారు.