YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్మార్ట్...చాలా స్లోగా.. (కరీంనగర్)

స్మార్ట్...చాలా స్లోగా.. (కరీంనగర్)

స్మార్ట్...చాలా స్లోగా.. (కరీంనగర్)
కరీంనగర్, నవంబర్ 04  (న్యూస్ పల్స్): కరీంనగర్‌లో ఆకర్షణీయ పనుల్లో ఆలస్యమవుతోంది.. ఎంపిక చేసిన ప్రాజెక్టులకు గడువు ఉన్నప్పటికీ ఆ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. నత్తనడకన సాగుతున్న పనులను చూస్తే నిర్ణీత గడువులో ‘స్మార్ట్‌’ పూర్తి చేయడం కష్టమే.. కొన్ని పునాదుల స్థాయిలోనే ఉండగా మిగతా పనుల ఊసే లేకుండా పోతోంది.  కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. గతంలో తయారు చేసిన ప్రాజెక్టులకు కన్సల్టెన్సీలతో అంచనాలు తయారు చేసి టెండర్లు నిర్వహించి పనులు కూడా ప్రారంభించారు. నగర సుందరీకరణ పనులు, పార్కులు, రహదారులు, కూడళ్ల వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పనులు ఇప్పటికీ పూర్తికాకపోగా.. పురోగతి కన్పించడం లేదు. పునాదుల స్థాయిలోనే ఉండగా మిగతా పనుల ఊసే లేకుండా పోతోంది. ఆకర్షణీయ నగరంలో భాగంగా పలు అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులు టెండర్లు నిర్వహించి పనులను గుత్తేదారులకు అప్పగించారు. మొదటగా నిర్వహించిన టెండర్‌లలో రూ.85.76 కోట్లతో 8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సర్కస్‌ మైదానం, పురాతన పాఠశాల మైదానంలో పార్కులు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, పారిశుద్ధ్య పనుల నిర్వహణలో  కంప్యాక్టర్స్‌, భూగర్భ చెత్తా డబ్బాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. మొత్తం అయిదు పనులు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రాజెక్టులో కమాన్‌ కూడలి రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు. అయితే పనులు దక్కించుకున్న సంస్థలు ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ముందస్తుగానే నిల్వ చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం, నెలల తరబడి నిలిపి వేయడంతో ప్రారంభించిన పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. రకరకాల కారణాలతో స్మార్ట్‌ పనులకు జాప్యం చేస్తున్నారు.
పురాతన పాఠశాల మైదానంలో అత్యాధునిక హంగులతో పార్కును నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. పచ్చదనం, ఫుడ్‌ కోర్టు, సందర్శకుల కోసం గ్యాలరీ, సులభ్‌ కాంప్లెక్స్‌లు, పార్కింగ్‌, హంపీ థియేటర్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం 5 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ చేయగా అందులో రెండు నెలలు గడిచింది. జ్యోతిబాపూలే సర్కస్‌ మైదానంలో లోపలిభాగం పూర్తిగా ఖాళీగా వదిలేసి అందులో ఒక వేదిక ఏర్పాటు చేయనున్నారు. రెండు చోట్ల ఫుడ్‌కోర్టు, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు, మైదానం చుట్టూ సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌, టైల్స్‌తో పార్కింగ్‌ వసతి, యోగా గ్యాలరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉండగా అందులో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అంబేడ్కర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనుల్లో భాగంగా జీ+2 కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఇండోర్‌స్టేడియం ఆధునికీకరణ, సైకిల్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తారు. మార్చి నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులు కూడా వేగంగా సాగడం లేదు. హౌసింగ్‌బోర్డుకాలనీలో ప్యాకేజీ-3లో రోడ్లు, మురుగు కాల్వల పనులు మొదలయ్యాయి. పనులకు కొంతమేర ఆటంకాలు వస్తుండగా ఆశించిన స్థాయిలో ప్రగతి కన్పించడం లేదు. పనులను వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పనుల్లో స్మార్ట్‌ బిన్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 20 డబ్బాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా వీటిలో ఒకే చోట రెండు డబ్బాలు బిగించారు. ఈ పనులు డిసెంబర్‌ చివరికల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంప్యాక్టర్‌ డబ్బాలు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు తెప్పించాల్సి ఉంటుంది.

Related Posts